ఉపాధ్యాయిని ఆత్మహత్య

28 May, 2018 10:56 IST|Sakshi
మృతదేహాన్ని పరిశీలిస్తున్న ఎస్‌ఐ మారుతి

ఉపాధ్యాయిని బలవన్మరణం

మద్దికెరలో విషాదం

కర్నూలు, మద్దికెర: మండల కేంద్రంలో ఓ ఉపాధ్యాయిని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఎస్‌ఐ మారుతి వివరాల మేరకు... అనంతపురం జిల్లా గుత్తికి చెందిన జయమ్మకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్దకుమార్తె బండారి వనిత (30) గుత్తి మండలం తొండపాడు  జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో గణితశాస్త్రం ఉపాధ్యాయునిగా పని చేసేది. అనిత చిన్నప్పటి నుంచి మద్దికెరలోని అమ్మమ్మ గద్దల నాగమ్మ వద్ద పెరిగింది. అయితే 8 నెలల క్రితం అమ్మమ్మ మరణించింది.

దీంతో అప్పటి నుంచి మనోవేదనకు గురయ్యేది. వేసవి సెలవుల నేపథ్యంలో కుటుంబ సభ్యులతో కలిసి అమ్మమ్మ ఇంటికి వచ్చింది. ఆదివారం ఉదయం తల్లి  చెల్లెలు, తమ్ముడితో కలిసి గుత్తిలోని చర్చికి వెళ్లింది. ఫోన్‌ చేసినా కుమార్తె ఫోన్‌ తీయకపోవడంతో తల్లి బంధువులకు సమాచారం తెలియజేసింది. వారు వెళ్లి చూడగా వనిత ఉరికి వేలాడుతూ కనిపించింది. ‘నా చావుకు ఎవరూ కారణం కాదు జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుంటున్నాను’ అంటూ రాసిన సూసైడ్‌ నోట్‌ ఘటన స్థలంలో లభించింది. ఎస్‌ఐ ఘటనస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

మరిన్ని వార్తలు