ఒక టీచర్‌.. నాలుగు పెళ్లిళ్లు

18 Feb, 2020 07:59 IST|Sakshi

రెండో భార్య ఫిర్యాదుతో వెలుగులోకి.. 

సాక్షి, గుంటూరు:  అతడో ఉపాధ్యాయుడు. మొదటి భార్య బతికుండగానే.. ఆమె చనిపోయినట్లు నమ్మించి నిరుపేద కుటుంబాలకు చెందిన యువతులను వరుస వివాహాలు చేసుకుంటున్నాడు. ఇలా ఇప్పటికే నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న ఆ నిత్య పెళ్లి కొడుకుపై అతడి రెండో భార్య ‘పోలీస్‌ స్పందన’ కార్యక్రమంలో గుంటూరు రూరల్‌ ఎస్పీ సీహెచ్‌ విజయారావుకు సోమవారం ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లా తోట్లవల్లూరు పంచాయతీ పరిధిలోని సౌత్‌ వల్లూరుకు చెందిన మహమ్మద్‌ బాజీ అలియాస్‌ షేక్‌ బాజీ అదే గ్రామంలోని మండల పరిషత్‌ పాఠశాలలో సెకండరీ గ్రేడ్‌ టీచర్‌గా పనిచేస్తున్నాడు. తన మొదటి భార్య చనిపోయిందని చెప్పి 2011లో తెలిసిన వ్యక్తుల ద్వారా బాధితురాలి తండ్రిని నమ్మించి ఆమెను రెండో వివాహం చేసుకున్నాడు.

చదవండి: ప్రేమించిన యువతితో నిశ్చితార్థం.. ఏమైందో కానీ..!

మొదటి రెండు నెలలు ఆమెను తన ఇంట్లోనే ఉంచాడు. ఆ తర్వాత వేరు కాపురం పెడతామని చెప్పి విజయవాడలో ఓ గది అద్దెకు తీసుకుని మకాం మార్చాడు. ప్రతి ఆదివారం ఆమె దగ్గరకు వచ్చి వెళ్లేవాడు. ఆ తరువాత మొహం చాటేయడంతో బాధితురాలు ఆరా తీయగా.. నాలుగేళ్ల క్రితం కృష్ణా జిల్లా పెనమలూరుకు చెందిన మరో యువతిని మూడో వివాహం చేసుకుని రహస్య కాపురం చేస్తున్నాడని తెలిసింది. ఇదేమని నిలదీయగా దుర్భాషలాడి కొట్టడంతో ఆమెకు గర్భస్రావమై ప్రాణా పాయ స్థితికి చేరుకోగా ఆస్పత్రిలో వదిలేసి వెళ్లాడు. ఆ తర్వాత మళ్లీ నెలకోసారి వచ్చి వెళ్లడం ప్రారంభించాడు.

పెద్దలు గట్టిగా నిలదీయడంతో తన ఆస్తుల్ని రెండో భార్య పేరిట రాస్తానని, ఇకనుంచి జాగ్రత్తగా చూసుకుంటానని నమ్మించాడు. ఇదిలావుండగా.. ఇటీవల దుగ్గిరాలకు చెందిన 15 ఏళ్ల మైనర్‌ బాలిక తల్లిదండ్రులకు రూ.30 వేలు ఇచ్చి ఆ బాలికను వివాహం చేసుకున్నాడు. కాగా, బాజీ మొదటి భార్య బతికే ఉందని, అతడి వేధింపులు భరించలేక పదేళ్ల క్రితం విడాకుల కోసం కోర్టును ఆశ్రయించినట్టు బాధితురాలికి తెలిసింది. బాజీపై తక్షణమే కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపట్టాలని ఎస్పీ విజయారావు తెనాలి డీఎస్పీకి ఆదేశాలిచ్చారు.  చదవండి: ‘శాడిస్ట్‌ ’ వీడియో కాల్స్‌ వెనక ఉన్న అసలు స్టోరీ 

మరిన్ని వార్తలు