టేకులపల్లి : కుటుంబ సభ్యుల వేధింపులు భరించలేక ఓ ఉపాధ్యాయుడు ఆత్మహత్యకు యత్నించాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు... మండలంలోని ముత్యాలంపాడు పంచాయతీ పాత తండా గ్రామానికి చెందిన భూక్య బాలు బొమ్మనపల్లి పంచాయతీ కొత్తతండా పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
తండ్రి సింగరేణి ఉద్యోగి. కొన్నేళ్ళ క్రితమే ఉద్యోగ విరమణ చేశారు. ఆయన రెండు నెలల క్రితమే మృతిచెందారు. ముగ్గురు చెల్లెళ్ళకు వివాహాలు కూడా చేశారు. కుటుంబీకుల వేధింపుల నేపథ్యంలో గత ఆరు సంవత్సరాల నుంచి బాలు తీవ్రం మనోవేదన చెందుతున్నాడు. దీనిని తట్టుకోలేక, ఆదివారం మధ్యాహ్నం పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు.
కొత్తగూడెంలోని ప్రయివేట్ ఆసుపత్రికి కుటుంబీకులు తరలించారు. బాలు వద్ద సూసైడ్ నోట్ను భార్య పద్మ గమనించింది. ఈ నెల 19వ తేదీన అది రాసినట్టుగా ఉంది. అందులోని సారాంశం... ‘‘నా ముగ్గురు చెల్లెళ్ళు, వారి భర్తలు కలిసి మా అమ్మను అడ్డుపెట్టుకుని గత ఆరు సంవత్సరాల నుంచి నన్ను మానసికంగా, ఆర్థికంగా వేధింపులకు గురిచేస్తున్నారు. ఇకపై వారి వేధింపులను తట్టుకునే ఓపిక లేదు. భరించలేను...’’ అని అందులో ఉంది. బాలు భార్య ఫిర్యాదుతో టేకులపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు జరుపుతున్నారు.