భార్య, బిడ్డను చంపి ఆత్మహత్యాయత్నం

26 May, 2018 07:27 IST|Sakshi

మైసూరు: కుటుంబ కలహాలతో తీవ్ర ఆవేదనకు గురైన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ భార్య, కుమార్తెల గొంతు కోసి చంపి, అనంతరం తాను కూడా ఆత్మహత్యకు యత్నించిన ఘటన కర్ణాటకలోని మైసూరు నగరంలో శుక్రవారం వెలుగుచూసింది. విషయం బయటకి తెలియనీయకుండా 24 గంటలపాటు అతను భార్యాబిడ్డల శవాలతో సహవాసం చేయడం గమనార్హం. మైసూరు జిల్లాలోని నంజనగూరు గ్రామానికి చెందిన ప్రజ్వల్‌ (45) బెంగళూరులోని ఒక ప్రముఖ ఐటీ కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేసేవాడు. ఇతనికి భార్య సవిత (39), కుమార్తె సించన (10) ఉన్నారు. ప్రజ్వల్‌ ఏడాది కిందట ఐటీ ఉద్యోగానికి రాజీనామా చేసిన అనంతరం మైసూరుకు వచ్చి విజయనగర 4వ స్టేజ్‌లో నివసిస్తూ వ్యాపారాలు చేయాలని ప్రయత్నిస్తున్నాడు. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి.

బుధవారం వీరు తమ పెళ్లి రోజు జరుపుకొన్నారు. అదే రోజు రాత్రి అందరూ నిద్రపోయాక ప్రజ్వల్‌ లేచి... కత్తితో భార్య సవిత, కుమార్తె సించనలను గొంతుకోసి చంపాడు. అప్పటి నుంచి గురువారం రాత్రి వరకూ ఇంట్లోనే శవాల మధ్యే గడిపాడు. ఈ విషయం ఎవరికీ తెలియనివ్వలేదు. తరువాత తన కుటుంబ సభ్యులకు ఈ ఘోరం గురించి తెలిపి, తాను కూడా చాకుతో గొంతు కోసుకున్నాడు. హుటాహుటిన ఇంటికి చేరుకున్న బంధువులు పోలీసుల సహకారంతో కొనప్రాణంతో ఉన్న ప్రజ్వల్‌ను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులు సవిత, సించన మృతదేహాలకు శవ పరీక్షలు నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.  విజయనగర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు