గల్లీ క్రికెట్‌ బాలల ధైర్య సాహసాలకు ఫిదా..

6 Jul, 2019 11:30 IST|Sakshi
పోలీసు అధికారి చేతుల మీదగా సర్టిఫికేట్‌, నగదు బహుమతి అందుకుంటున్న బాలుడు

జైపూర్‌ : కామాంధుడి బారినుంచి ఓ మైనర్‌ బాలికను రక్షించారు నలుగురు గల్లీ క్రికెట్ బాలురు. ధైర్యంగా కామాంధుడిని ఎదుర్కోవటమే కాకుండా అతడ్ని చితకబాది పోలీసులకు అప్పగించి శభాష్ అనిపించుకున్నారు. ఈ సంఘటన గురువారం రాజస్తాన్‌లోని జైపూర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జైపూర్‌కు చెందిన మనీష్‌, అమిత్‌, రోహిత్‌, బాదల్‌ అనే కుర్రాళ్లు గురువారం క్రికెట్‌ ఆడటంలో బిజీగా ఉన్నారు. కొద్దిసేపటి తర్వాత బాలిక గట్టిగా అరవటం వారికి వినిపించింది. దీంతో అరుపులు వినిపించిన వైపు పరుగులు పెట్టారు. అక్కడికి దగ్గరలో ఉన్న కొండ ప్రాంతంలో మైనర్‌ బాలికపై ఓ వ్యక్తి లైంగికదాడికి యత్నించటం వారి కంటపడింది.

వెంటనే అతడ్ని అడ్డుకుని బాలికను రక్షించారు. అంతటితో ఆగకుండా నిందితుడిని చితకబాది పోలీసులకు అప్పగించారు. గల్లీ క్రికెట్‌ బాలల ధైర్య సాహసాలకు ఫిదా అయిన పోలీసులు శుక్రవారం వారిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అడిషినల్‌ డీజీపీ బీకే సోనీ మాట్లాడుతూ.. ‘‘ఆ నలుగురు బాధ్యత గల పౌరులుగా వ్యవహరించారు. భవిష్యత్తులో వారికి అంతా మంచి జరగాలని ఆకాంక్షిస్తున్నాన’’ని తెలిపారు.

మరిన్ని వార్తలు