మరో మన్మథుడు.. యుక్త వయస్సు మహిళలే టార్గెట్‌

31 May, 2020 06:58 IST|Sakshi

చిత్రాల మార్ఫింగ్‌ ..బ్లాక్‌ మెయిల్‌ 

పరమకుడిలో చిక్కిన వైనం 

సాక్షి, చెన్నై:  రామనాథపురంలో మరో మన్మథుడు పోలీసులకు చిక్కాడు. యుక్త వయస్సు దాటిన మహిళలు, వివాహమైన వారిని టార్గెట్‌ చేయడం, వారి చిత్రాలను మార్ఫింగ్‌ చేసి బ్లాక్‌ మెయిల్‌కు పాల్పడుతున్న సరిగ్గా మీసాలు కూడా రాని ఈ మన్మథుడికి తమదైన స్టైల్లో పోలీసులు ట్రీట్‌మెంట్‌ ఇస్తున్నారు. అంతే కాదు, ఇతగాడి బాధితులు ఉంటే, ఫిర్యాలు చేయాలని ప్రత్యేక నంబర్‌ను ప్రకటించారు. కన్యాకుమారి జిల్లా నాగర్‌ కోయిల్‌లో కాశి అనే మన్మతుడు యువతుల్ని టార్గెట్‌ చేసి సాగించిన లీల, మోసాలు, బ్లాక్‌ మెయిలింగ్‌ గురించి తెలిసిందే. ఇతగాడి చేతిలో మోసపోయిన వాళ్లు ఎక్కువే కావడంతో కేసు సీబీసీఐడీకి సైతం చేరింది. ఈ పరిస్థితుల్లో ఆంటీలను టార్గెట్‌ చేసి, అంకుల్స్‌కు సైతం ముచ్చెమటలు పట్టిస్తున్న మరో మన్మథుడి లీల బయటపడింది. చదవండి: కరోనా ఎఫెక్ట్‌: మెట్రో కీలక నిర్ణయం

ధైర్యంగా ఫిర్యాదు.. 
రామనాథపురం పరమకుడికి చెందిన ఓ ఉద్యోగి శుక్రవారం ఎస్పీ వరుణ్‌కుమార్‌కు ఓ ఫిర్యాదు చేశాడు. తన భార్య చిత్రాల్ని మార్ఫింగ్‌ చేసి ఎవరో ఓ యువకుడు బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నాడని, ఆమె తీవ్ర ఆందోళనతో ఉందని, మరో వేదనలో పడి ఉందని వివరించాడు. తాను ఆ యువకుడితో మాట్లాడగా రూ. 20 వేలు ఇస్తే సరి అని, ఇవ్వకుంటే సామాజిక మాధ్యమాల్లోకి ఆ ఫొటోల్ని ఎక్కిస్తానని బెదిరిస్తున్నట్టు ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ ఫిర్యాదును తక్షణం పరిగణనలోకి తీసుకున్న ఎస్పీ ఓ బృందాన్ని రంగంలోకి దించారు. ఆ యువకుడ్ని పట్టుకునేందుకు పథకం వేశారు. ఆ యువకుడు అడిగిన మొత్తాన్ని ఇవ్వడానికి ఆ ఉద్యోగి సిద్ధమయ్యాడు.

ఆ నగదు తీసుకునేందుకు శనివారం వేకువజామున ఓ చోటకు వచ్చిన ఆ యువకుడు అడ్డంగా బుక్కయ్యాడు. ఇతడు స్థానికంగా ఉన్న ఓ కళాశాలలో ఇంజినీరింగ్‌ మొదటి సంవత్సరం చదువుతున్నట్టు, అతడు ఉలగనాథపురానికి చెందిన రోహిత్‌ అని తేలింది.  సరిగ్గా మీసాలు కూడా రాని ఇతడు ఫేస్‌ బుక్, టిక్‌ టాక్, వాట్సాప్‌ల ద్వారా యుక్త వయస్సు దాటిన వాళ్లు, వివాహమైన మహిళల్ని టార్గెట్‌ చేశాడు. వారితో పరిచయాలు పెంచుకోవడమే కాదు, వారి ఫొటోలను మార్ఫింగ్‌ చేసి వారికే పంపించడం సామాజిక మాధ్యమాల్లోకి ఎక్కిస్తానని బెదిరించడం, కొందర్ని లొంగ దీసుకున్నట్టు, మరి కొందరి వద్ద నగదు దోచుకున్నట్టు విచారణలో తేలింది.

అలాగే, అతడి సెల్‌ఫోన్‌ నిండా మార్ఫింగ్‌ చేసిన మహిళ చిత్రాలే ఉండడం, బెదిరింపు మెసేజ్‌లు అనేక మందికి పంపించి ఉండడం వెలుగు చూసింది. దీంతో ఇతగాడి బాధితులు ఎక్కువగానే ఉంటారని భావించిన పోలీసులు ధైర్యంగా ఫిర్యాదు చేయడానికి ముందుకు రావాలని పిలుపు నిచ్చారు. అలాగే, ఓ సెల్‌ నంబర్‌ను ప్రకటించి, సమాచారం ఇవ్వాలని, బాధితుల వివరాల్ని గోప్యంగా ఉంచుతామని ఎస్పీ వరుణ్‌కుమార్‌ పిలుపునిచ్చారు. ఇతగాడికి తమదైన స్టైల్లో ట్రీట్‌మెంట్‌ ఇస్తూ, మరిన్ని విషయాల్ని రాబట్టే పనిలో రామనాథపురం పోలీసులు నిమగ్నం అయ్యారు. చదవండి: జయ ఆస్తిపై పూర్తి హక్కులు వారికే

మరిన్ని వార్తలు