సాక్షి, సింహాచలం(పెందుర్తి): తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి సింహాచలంలో ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం వెలుగుచూసింది. గోపాలపట్నం పోలీసులు అందించిన వివరాల ప్రకారం... సింహాచలం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న వేంకటేశ్వరస్వామి ఆలయానికి ఎగువ వైపు ఉన్న దేవస్థానం తోటల్లో దుర్వాసన వస్తుండడంతో స్థానికులు కొంతమంది వెళ్లి చూశారు. చెట్టుకు వేలాడుతూ ఓ వ్యక్తి మృతదేహం కనిపించడంతో వెంటనే గోపాలపట్నం పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న సీఐ రమణయ్య, ఎస్ఐ సత్యనారాయణ వివరాలు సేకరించారు.
మృతుడి వద్ద ఉన్న సెల్ఫోన్ ఆధారంగా తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా కొడిమెల మండలం పూడూరుకి చెందిన పున్నం ఆదయ్య(35) అలియాస్ అరుణ్గా గుర్తించి కుటుంబ సభ్యులకి సమాచారం అందించారు. రజక వృత్తి చేసుకుని జీవిస్తున్న ఆదయ్యకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని, మానసిక స్థితి సరిగా లేకపోవడంతో 15 రోజుల కిందట ఇంటి నుంచి వెళ్లిపోయాడని కుటుంబ సభ్యులు తెలిపారని పోలీసులు వెల్లడించారు. అనంతరం వారణాసి, విజయవాడలో తిరిగినట్లు జేబులో టిక్కెట్లు ఉన్నాయని, ఈ నెల 6న సింహాచలం వచ్చినట్లు సిటీ బస్సు టికెట్ ఉందని తెలిపారు. రెండు రోజుల కిందటే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కేజీహెచ్కు తరలించి కేసు నమోదు చేశారు.