కదం తొక్కిన ఆశ వర్కర్లు

13 Mar, 2020 03:18 IST|Sakshi
ఆశ వర్కర్లను అరెస్టు చేస్తున్న పోలీసులు

ఏపీలో మాదిరిగా ఫిక్స్‌డ్‌ వేతనం ఇవ్వాలని డిమాండ్‌

సుల్తాన్‌బజార్‌: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇస్తున్నట్లు తమకు కూడా రూ.10,000 ఫిక్స్‌డ్‌ వేతనం ఇవ్వాలని కోరుతూ ఆశ వర్కర్లు తలపెట్టిన ‘తెలంగాణ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ కార్యాలయ ముట్టడి’కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్‌లోని కోఠి డీఎంఈ కార్యాలయానికి వస్తున్న ఆశ వర్కర్లను సుల్తాన్‌ బజార్‌ పోలీసులు కోఠి డీఎంహెచ్‌ఎస్‌ గేటు వద్ద అడ్డుకున్నారు. 865 మంది ఆశా వర్కర్లతో పాటు సీఐటీయూ నాయకులను అరెస్టు చేసి నగరంలోని వివిధ పోలీసుస్టేషన్లకు తరలించారు. ఘటనపై 8 కేసులను నమోదు చేశారు. తమ హక్కుల కోసం నిరసన తెలిపేందుకు వస్తున్న ఆశ వర్కర్లను పోలీసులు బలవంతంగా అరెస్ట్‌ చేశారని తెలంగాణ ఆశ యూనియన్‌ అధ్యక్షురాలు పి.జయలక్ష్మి ఆరోపించారు. ప్రభుత్వ దమనకాండను నిరసిస్తూ శుక్రవారం (13న) రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు, 19న కలెక్టర్‌ కార్యాలయాల ముందు ధర్నాలు చేస్తామని వెల్లడించారు.

మరిన్ని వార్తలు