మానస సరోవరం: ముమ్మరంగా సహాయక చర్యలు!

3 Jul, 2018 16:07 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఢిల్లీ: మానస సరోవర యాత్రలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ముమ్మర ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన గ్రంధి సుబ్బారావు అనే తెలుగు యాత్రికుడు ప్రమాదవశాత్తూ మృతిచెందిన సంగతి తెల్సిందే. ఆయన మృతదేహాన్ని హిల్సా నుంచి సిమికోట్‌కు నేపాల్‌ అధికారులు తరలిస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం లక్నో మీదుగా కాకినాడ తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మృతదేహాన్ని తర్వగా తరలించేందుకు నేపాల్‌ రాయబార కార్యాలయంతో ఏపీభవన్‌ అధికారులు సంప్రదింపులు చేపడుతున్నారు.

కేరళకు చెందిన మరో యాత్రికుడు కూడా ఈ మానస సరోవర యాత్రలో ప్రమాదవశాత్తూ చనిపోయినట్లు తెలిసింది.  యాత్రికులకు తరలించేందుకు అధికారులు ఏడు విమానాలను ఏర్పాటు చేశారు. సిమికోట్‌ నుంచి నేపాల్‌గంజ్‌కు 104 మంది యాత్రికుల తరలించారు. తెలుగువారి బాగోగులు తెలుసుకుని సహాయక చర్యలు చేపట్టేందుకు  నేపాల్‌ గంజ్‌కు ఆంధ్రప్రదేశ్‌ భవన్‌ నుంచి ఒక టీంను ఓఎస్‌డీ రవి శంకర్‌ ఆధ్వర్యంలో బుధవారం పంపుతున్నామని ఏపీ భవన్‌ అధికారి డాక్టర్‌ శ్రీకాంత్‌ తెలిపారు.

ఈ విషయమై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఢిల్లీలో మాట్లాడారు. మానస సరోవర యాత్రికులను సురక్షితంగా తరలించేందుకు అత్యవసర ఏర్పాట్లు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. హిల్సా బేస్ క్యాంప్ లో చిక్కుకున్న వారికి అవసరమైన వైద్య చికిత్స అందించాలన్నారు. మానస సరోవర యాత్రకు వెళ్లిన వారు సురక్షితంగా రావాలని ప్రార్ధిస్తున్నట్లు తెలిపారు.

అమర్‌నాథ్‌ యాత్రలో అపశృతి

అమర్‌నాథ్ యాత్రలో మంగళవానం అపశృతి చోటుచేసుకుంది. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లిన పశ్చిమగోదావరి జిల్లా చాగల్లుకు చెందిన తోట రత్నం(72) అనే తెలుగు మహిళ గుండెపోటుతో మృతి చెందారు. ఈ ఘటన బలకేజ్ బేస్ క్యాంప్‌లో జరిగినట్లు అధికారులు వెల్లడించారు. నాలుగు రోజుల క్రితమే రత్నం రాజమండ్రి వారితో కలిసి యాత్రకు వెళ్లినట్లు సమాచారం అందింది. రత్నం మృతి చెందినట్లు వారి కుటుంబ సభ్యులకి అధికారులు సమాచారం అందించారు. దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతదేహాన్ని చాగల్లుకు తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 

మరిన్ని వార్తలు