పదేళ్ల బాలికపై అత్యాచారం

19 Jul, 2018 13:02 IST|Sakshi

ఎచ్చెర్ల క్యాంపస్‌:  శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలోని డి.మత్స్యలేశం గ్రామానికి చెందిన పదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి నిర్భయ కేసు నమోదు చేశారు. శ్రీకాకుళం డీఎస్పీ భీమారావు బుధవారం ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు తెలిపారు. ఐదో తరగతి చదువుతున్న బాలికపై ఈ నెల 14వ తేదీ(శనివారం) సాయంత్రం 7 గంటల సమయంలో నిందితుడు గనగళ్ల కొరయ్య.. చిల్లర డబ్బులు ఆశజూపి ప్రాథమిక పాఠశాల వద్దకు తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడని వివరించారు. ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్నాడని తెలిపారు.

బాలిక ఇంటికి వెళ్లే సరికి రక్తస్రావం అవుతుండటంతో కుటుంబ సభ్యులు గమనించి హుటాహుటిన ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. వైద్యులు ప్రాథమిక చికిత్స అందించి.. శ్రీకాకుళం రిమ్స్‌కు రిఫర్‌ చేశారు. అక్కడ చికిత్స చేసిన వైద్యులు.. అత్యాచారం జరిగినట్లు గుర్తించారు. ఆదివారం ఉదయం బాలిక తల్లి ఎచ్చెర్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. బాలిక చెప్పిన వివరాలను పోలీసులకు తెలిపారు. వైద్య పరీక్షలు నివేదిక, తల్లి ఫిర్యాదు, బాలిక వివరణ అధారంగా పోలీసులు విచారణ ప్రారంభించారు. డీఎస్పీ భీమారావు, సీఐ రామకృష్ణ, ఎస్సై కృష్ణ దర్యాప్తుచేయగా.. నిందితుడిని సుదీర్ఘంగా విచారించి బుధవారం అరెస్టు చేశారు. గతంలో పొన్నాడ గ్రామంలో ఇలాంటి కేసు నమోదైంది. 60 ఏళ్ల వృద్ధుడు బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. మత్స్యలేశం వంటి గ్రామంలో ఇటువంటి అఘాయిత్యాలు జరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.  

మరిన్ని వార్తలు