విద్యార్థినిపై సామూహిక లైంగిక దాడి

15 Oct, 2018 11:05 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలో దారుణం చోటుచేసుకుంది. తూర్పు ఢిల్లీలోని వినోద్‌ నగర్‌లో పదో తరగతి విద్యార్థినిపై శనివారం నలుగురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. నిందితుల్లో ఒకరైన అమిత్‌ కుమార్‌ బాధిత బాలిక కుటుంబానికి తెలిసిన వ్యక్తి కావడం గమనార్హం. సమీప పార్క్‌లో కలువాలని బాలికను కుమార్‌ తీసుకెళ్లగా అక్కడ మరో ముగ్గురు నిందితులు కిషన్‌ నేగి (42), పంకజ్‌ మెహతా (42) రాజు కుమార్‌ (20)లు కలిశారు.

బాలికను పార్క్‌ నుంచి సమీప ఫ్లాట్‌లోకి తీసుకెళ్లిన నిందితులు అక్కడ ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. నిందితుడు బాధితురాలిని బలవంతంగా సమీప ఫ్లాట్‌కు తీసుకెళ్లి నేరానికి పాల్పడ్డాడని కళ్యాణ్‌పురి పోలీసులు తెలిపారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.

మరోవైపు పశ్చిమ ఢిల్లీలోని ద్వారకలో ఓ మల్టీనేషనల్‌ కంపెనీలో పనిచేసే యువతిపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆఫీస్‌ పనులు ముగించుకుని వచ్చిన యువతిని లిఫ్ట్‌ ఇస్తామని చెప్పిన నిందితులు మార్గమధ్యంలో ఆమెకు మత్తు మందు కలిపిన కూల్‌ డ్రింక్‌ ఇచ్చి అపస్మారకస్ధితిలోకి వెళ్లిన బాధితురాలిని ఫ్లాట్‌లోకి తీసుకెళ్లి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు. నేరానికి పాల్పడిన అనంతరం బాధితురాలిని వసంత్‌కుంజ్‌ ప్రాంతంలో వదిలివెళ్లారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు