ఫెయిల్‌ అవుతానన్న బెంగతో ఆత్మహత్య

8 May, 2019 07:15 IST|Sakshi
ఫిజా ఫిర్దౌజ్‌(ఫైల్‌)

ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని బలవన్మరణం

అఘాయిత్యానికి పాల్పడిన పదో తరగతి విద్యార్థిని

కాగజ్‌నగర్‌: పరీక్షలో ఫెయిల్‌ అవుతానన్న బెంగతో ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుని పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కాగజ్‌నగర్‌లో చోటు చేసుకుంది. సీఐ తెల్లబోయిన కిరణ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన మహ్మద్‌ అన్వర్, అంజుమ్‌బేగం దంపతుల కుమార్తె ఫిజా ఫిర్దౌజ్‌(15) స్థానిక వీఐపీ పాఠశాలలో పదో తరగతి పూర్తి చేసింది. మార్చిలో వార్షిక పరీక్షలు రాసిన ఫిర్దౌజ్‌ ఫలితాల కోసం వేచిచూస్తోంది. కాగా రెండు రో జులుగా పరీక్షలు బాగా రాయలేదని ఆందోళన చెందుతుంది. ఈ భయంతో మంగళవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఫిజా ఫిర్దౌజ్‌ బాత్‌రూంలో ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

అన్వర్‌ దంపతులకు ముగ్గురు సంతానం. ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు. పెద్దబ్బాయి అమాన్‌ హైదరాబాద్‌లో డిగ్రీ చదువుతుండగా రెండోబ్బాయి నౌమాన్‌ కాగజ్‌నగర్‌లోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్, కూతురు ఫిజా ఫిర్దౌజ్‌ పదో తరగతి పూర్తిచేసింది. వార్షిక పరీక్షలు సక్రమంగా రాయలేదని గత రెండు రోజులుగా బెంగతో ఉందని కుటుంబీకులు తెలిపారు. పరీక్షలో ఫెయిల్‌ అవుతానేమోనని మనస్థాపానికి గురై బలవన్మరణానికి పాల్పడింది.

పవిత్ర రంజాన్‌ మాసం ప్రారంభం కావడంతో తల్లిదండ్రులు వేకువ జామున సహెర్‌ చేసి ఉపవాస దీక్ష పట్టి మళ్లీ నిద్రపోయారు. అయితే 9 గంటల ప్రాంతంలో ఫిర్దౌజ్‌ బాత్‌రూమ్‌లోకి వెళ్లి ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుంది. బాత్‌రూం నుంచి పోగలు రావడంతో కుటుంబీకులు వెళ్లి చూసేసరికి పూర్తిగా కాలిపోయింది. పోలీసులకు సమాచారం అందించడంతో పట్టణ సీఐ కిరణ్‌ అక్కడకు చేరుకుని పరిశీలించారు. బాలిక తండ్రి అన్వర్‌ ఫిర్యాదు మెరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు.  

>
మరిన్ని వార్తలు