జట్టు కట్టి.. మట్టుబెట్టి

5 Sep, 2018 08:40 IST|Sakshi

ఉగ్ర ‘లింకు’ అలా..!

దూర విద్యకు ఉర్దూ వర్శిటీలో ప్రవేశించిన సాదిఖ్‌  

ఈ–మెయిల్‌ ఐడీరూపొందించిందీ హైదరాబాదీ ముజాహిద్‌

బంజారాహిల్స్‌లో శిక్షణ పొందిన ఐఎం మీడియా సెల్‌ ఇన్‌చార్జి  

ఫారూఖ్‌ స్వస్థలంమహబూబ్‌నగర్‌ సమీపంలోని నారాయణ్‌పేట్‌

సాక్షి, హైదరాబాద్‌: కొన్నేళ్ల క్రితం గోకుల్‌ చాట్, లుంబినీ పార్కుల్లో జరిగిన బాంబు పేలుడు ఘటనలు నగరాన్ని ఎంతలా కుదిపేశాయో అందరికీ తెలిసిందే. ఈ కేసుల్లో నిందితులుగా ఉన్న ఎనిమిది మంది నిందితుల్లో ఒక్కరూ స్థానికులు లేరు. అయితే వీరిలో నిందితులుగా ఉండి, అభియోగాలు వీగిపోయిన ఇద్దరు ఇండియన్‌ ముజాహిదీన్‌ (ఐఎం) ఉగ్రవాదులకూ సిటీ, శివారు జిల్లాలతో లింకులు ఉన్నాయి. మరో కీలక ఉగ్రవాది నగరంలో ఎథికల్‌ హ్యాకింగ్‌ శిక్షణ తీసుకున్నాడు. ముంబైలోని అంథేరి ప్రాంతానికి చెందిన సాదిఖ్‌ ఇష్రార్‌ షేక్‌ బంధువులు సిటీలో ఉండగా.. పుణేలోని ఖాండ్వా ప్రాంతంలో ఉంటున్న ఫారూఖ్‌ సర్ఫుద్దీన్‌ షేక్‌ స్వస్థలం మహబూబ్‌నగర్‌ సమీపంలోని నారాయణ్‌పేట్‌. రెండు పేలిన బాంబు కేసుల్లో, ఓ పేలని బాంబు కేసుల్లో నిందితులుగా ఉన్న వీరిపై మంగళవారం అభియోగాలు వీగిపోయాయి. మిగిలిన ముగ్గురిలో అనీఖ్‌ షఫీఖ్‌ సయ్యద్, అక్బర్‌ ఇస్మాయిల్‌ చౌదరిని కోర్టు దోషులుగా తేల్చింది. మరో నిందితుడు తారిఖ్‌ అంజుమ్‌ హసన్‌పై సోమవారం నిర్ణయం తీసుకోనుంది. అలాగే ఐఎం మీడియా సెల్‌ ఇన్‌చార్జి పీర్భాయ్‌.. ‘మక్కా’ పేలుడు సమయంలో నరగంలోనే కంప్యూటర్‌ శిక్షణ తీసుకుంటున్నాడు.

మహ్మద్‌ సాదిక్‌ ఇష్రార్‌ షేక్‌ అలియాస్‌ యాసీర్‌ అలియాస్‌ ఇమ్రాన్‌ అంధేరిలోని సీఎంఎస్‌ కంప్యూటర్స్‌లో డెస్క్‌టాప్‌ ఇంజినీర్‌గా పనిచేస్తూ ఉగ్రవాద సంస్థ ఐఎంకు కో–ఫౌండర్, ఫెసిలిటేటర్‌గా వ్యవహరించాడు. ఐఎం సంస్థ జంట పేలుళ్లతో సహా 2005 ఫిబ్రవరి నుంచి దేశ వ్యాప్తంగా సృష్టించిన 11 విధ్వంసాల్లోనూ ఇతని పాత్ర ఉన్నట్లు దర్యాప్తు అధికారులు తేల్చారు. సాదిక్‌ కుటుంబం ఉత్తరప్రదేశ్‌లోని ఆజామ్‌ఘర్‌ నుంచి 40 ఏళ్ల క్రితం ముంబైకి వలస వచ్చింది. అక్కడి హబీబ్‌ టెక్నికల్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఐటీఐ పూర్తిచేసిన సాదిక్‌ అక్కడి గోద్రేజ్‌ కంపెనీలో చేరాడు. 2000లో దూరవిద్య ద్వారా బీఏ చదవడం కోసం హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్‌ ఉర్దూ యూనివర్శిటీలో చేరాడు.

ముంబై ఛత్రపతి శివాజీ టెర్మినల్‌ సమీపంలో ఉన్న అంజుమన్‌ ఇస్లామ్‌ హైస్కూల్‌లోని ఉర్దూ యూనివర్శిటీ సెంటర్‌కు హాజరయ్యేవాడు. 1996లో గోద్రేజ్‌ కంపెనీలో పనిచేస్తున్న కాలంలోనే స్టూడెంట్స్‌ ఇస్లామిక్‌ మూవ్‌మెంట్‌ ఆఫ్‌ ఇండియా (సిమి) భావాలపట్ల ఆకర్షితుడై ఆ సంస్థలో చేరాడు. అప్పట్లో సిమిపై నిషేధం లేదు. చిత్తూరు జిల్లా పీలేరు నుంచి వలస వచ్చి ముంబైలోనే స్థిరపడ్డ అన్సార్‌తో కలిసి 1996–97ల్లో సిమి సమావేశాల్లో చురుగ్గా పాల్గొన్నాడు. సిమి నిర్వహించే అనేక సమావేశాలకు రియాజ్‌ భత్కల్, అబ్దుల్‌ సుభాన్‌ ఖురేషీ అలియాస్‌ తౌఖీర్‌ సైతం హాజరయ్యేవారు. ఈ సంస్థ వ్యవహారాలను నిశితంగా పరిశీలించిన తరవాత సాదిక్‌ పునరాలోచనలో పడ్డాడు. సిమి సంస్థ కేవలం సమావేశాలు నిర్వహించడం మాత్రమే కాదని, మరెన్నో ‘వ్యవహారాలు’ సాగిస్తోందని తెలిసి ఆ సంస్థ సమావేశాలకు దూరంగా ఉండడం ప్రారంభించాడు.

మలుపుతిప్పిన ముజాహిద్‌ పరిచయం
హైదరాబాద్‌కు చెందిన ముజాహిద్‌ (2004లో మరణించాడు) పరిచయం సాదిక్‌ జీవితాన్ని పూర్తిగా ఉగ్రవాదం వైపు మళ్లించింది. ముజాహిద్, సాదిక్‌ షేక్‌ల మధ్య బంధుత్వం ఉంది. 2001 ఏప్రిల్‌లో ముజాహిద్‌ ముంబై వెళ్లిన సందర్భంలో సాదిక్‌తో పరిచయం ఏర్పడింది. ఇతని స్ఫూర్తితో సాదిక్‌ ఉగ్రవాదం వైపు మళ్లాడు. అప్పట్లో సాదిక్‌ షేక్‌ను ముజాహిద్‌ ముంబైలోని ఓ సైబర్‌కేఫ్‌కు తీసుకువెళ్లి ఓ ఈ–మెయిల్‌ ఐడీ రూపొందించి ఇచ్చాడు. ఈ మెయిల్‌ను క్రమం తప్పకుండా బ్రౌజ్‌ చేస్తూ ఉండమని, ఈ–మెయిల్‌ ద్వారానే ఓ వ్యక్తి పరిచయం అవుతాడని సాదిక్‌కు చెప్పాడు. అతడు చెప్పినట్లుగానే మూడు నెలల పాటు బ్రౌజ్‌ చేసిన అనంతరం ఓ వ్యక్తి నుంచి సాదిక్‌కు సందేశాలు రావడం మొదలయ్యాయి.

కొంతకాలానికి తనను కలవాలంటూ సాదిక్‌కు ఆ వ్యక్తి మెయిల్‌ పంపాడు. దీనికి స్పందనగా ముంబైలోని చీతా క్యాంప్‌లో ఉన్న మదీనా హోటల్‌ వద్ద కలుద్దామంటూ సాదిక్‌ వర్తమానం పంపాడు. అనుకున్నట్లే వచ్చిన ఆ వ్యక్తి తన పేరును జహీర్‌గా చెప్పుకున్నాడు. అతనే ఇండియన్‌ ముజాహిదీన్‌ (ఐఎం) ఏర్పడటానికి కారణమైన కోల్‌కతాకు చెందిన అమీర్‌ రజా సోదరుడు ఆసిఫ్‌ రజా అని సాదిక్‌కు ఆ తరవాత తెలిసింది. ఎప్పటికీ వెనుకడుగు వేయనంటూ సాదిక్‌ నుంచి మాట తీసుకున్న ఆసిఫ్‌.. అతన్ని పూర్తిగా ఉగ్రవాదం వైపు మళ్లించాడు. 

అనీఖ్‌కు ‘రిఫరెన్స్‌’ ఇచ్చిన ఫారూఖ్‌
రియాజ్‌ ఆదేశాల మేరకు పేలుళ్లకు దాదాపు నెల రోజుల ముందు అనీఖ్‌ హైదరాబాద్‌కు బయలుదేరాడు. తన బంధువు రిఫరెన్స్‌ ఇచ్చిన వ్యక్తి ఫారూఖ్‌ షర్ఫుద్దీన్‌ తర్ఖాష్, మహబూబ్‌నగర్‌ సమీపంలోని నారాయణ్‌పేట్‌కు చెందిన ఫారూఖ్‌ కుటుంబం పూణేలోని క్యాంపు ఏరియాకు వలస వెళ్లింది. పూణేలో ఇతనితో కలిసి చదువుకున్న మాజిద్‌ ద్వారా అనీఖ్‌ షఫీఖ్‌ సయీద్‌ పరిచయమయ్యాడు. 2007 జూలైలో హైదరాబాద్‌లో ఓ పని నిమిత్తం వెళ్తున్నానని ఫారూఖ్‌తో చెప్పాడు. అక్కడ కొంత కాలం ఉండడానికి ఆశ్రయం కల్పించమని కోరాడు. దీంతో నారాయణ్‌పేట్‌ నుంచి వచ్చి సరూర్‌నగర్‌లో ఉంటున్న దూరపు బంధువు నవీద్‌ దగ్గరకు వెళ్లాల్సిందిగా ఫారూఖ్‌ సూచించి నవీద్‌ ఫోన్‌ నెంబర్‌ సైతం ఇచ్చి పంపాడు. అలా 2007 ఆగస్టు 1న ఇండియన్‌ ముజాహిదీన్‌ మాస్టర్‌మైండ్‌ రియాజ్‌ భత్కల్‌ ఆదేశాల ప్రకారం హైదరాబాద్‌ వచ్చిన అనీఖ్‌.. నవీద్‌ దగ్గర రెండు రోజులు ఆశ్రయం పొందాడు. ఆ తర్వాత హబ్సిగూడలోని స్ట్రీట్‌ నెం.8లోని బంజారా నిలయంలో ఫ్లాట్‌ అద్దెకు తీసుకున్నాడు.
 
పీర్భాయ్‌ ఎథికల్‌ హ్యాకింగ్‌ కోర్స్‌
ఇండియన్‌ ముజాహిదీన్‌కు మీడియా సెల్‌ ఇన్‌చార్జిగా వ్యవహరించడంతో పాటు పేలుళ్లకు ముందు మీడియా సంస్థలకు ఈ–మెయిల్‌ పంపిన ఉగ్రవాది మన్సూర్‌ అస్ఘర్‌ పీర్భాయ్‌. పుణేకు చెందిన ఇతడు 2007లో కొన్నాళ్లు సిటీలో ఉన్నాడు. కంప్యూటర్‌ రంగంలో నిపుణుడైన ఇతడు రియాజ్‌ భత్కల్‌ ఆదేశాల మేరకు 2007లో సిటీకి వచ్చి ప్రత్యేక శిక్షణ పొందాడు. బంజారాహిల్స్‌లోని ఈ–2 ల్యాబ్స్‌ సంస్థ.. ఫార్చూన్‌ కత్రియ హోటల్‌లో ఆ ఏడాది మే 14 నుంచి 19 వరకు ఎథికల్‌ హ్యాకింగ్‌ కోర్సులో శిక్షణనిచ్చింది. దీనికి హాజరైన పీర్భాయ్‌.. అదే నెల 18న మక్కా మసీదులో పేలుడు జరిగినట్లు తెలుసుకుని అక్కడకు వెళ్లి చూశాడు. ఈ విషయాలను రియాజ్‌ భత్కల్‌కు వివరించాడు. ఈ నేపథ్యంలోనే భత్కల్‌ తదితరులు మక్కా పేలుడుకు ప్రతీకారంగా సిటీని టార్గెట్‌ చేశాడు. 

మరిన్ని వార్తలు