న్యూఢిల్లీ: దృష్టి మరల్చి(అటెన్షన్ డైవర్షన్) దొంగతనం చేసే గ్యాంగ్లు ఈ మధ్యకాలంలో ఎక్కువయ్యాయి. తాజాగా ఢిల్లీ అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు విజయేందర్ గుప్తా భార్య శోభా విజయేందర్ కూడా ఈ గ్యాంగ్ బారిన పడ్డారు. మండీ హౌజ్ సమీపంలో సోమవారం ఉదయం ఆమె దృష్టి మరల్చి కారులోంచి వస్తువులను దుండగులు ఎత్తుకెళ్లారు. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు స్కూటర్పై వెళుతూ కారులోంచి ఆయిల్ లీకవుతుందని చెప్పారు. కారు దిగి లీకేజి చెక్ చేస్తుండగా కారులోని ఆమె వస్తువులను దొంగలు ఎత్తుకెళ్లిపోయారు. దీనిపై పోలీసులకు శోభ ఫిర్యాదు చేశారు. అయితే ఇది థక్-థక్ గ్యాంగ్ పనే అని, దృష్టి మరల్చి దొంగతనం చేయడంలో ఈ ముఠా ఆరితేరిందని పోలీసు సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.