ఎట‍్టకేలకు చిక్కిన యాక్టివాల దొంగ

26 Dec, 2017 18:42 IST|Sakshi

17స్కూటర్లు స్వాధీనం

సాక్షి, మహబూబ్‌నగర్‌ క్రైం: హోండ కంపెనీ వాహనాలకు ఫైనాన్స్‌ ఇచ్చే కార్యాలయంలో రికవరీ ఎజెంట్‌గా పని చేసిన అనుభవం ఉండటం వల్ల కేవలం హోండా కంపెనీకి చెందిన యాక్టివా స్కూటర‍్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు చేశాడు. రోడ్డుపై..వివిధ పెళ్లిల సమయంలో పంక్షన్‌ హాల్స్‌లలో పార్క్‌ చేసిన వాటిని మాత్రమే దొంగలిస్తూ వచ్చాడు. ఎట‍్టకేలకు హోండా యాక్టివాల దొంగను పోలీసులు పట్టుకున్నారు.  జిల్లా ఎస్పీ బి.అనురాధ మంగళవారం వివరాలను మీడియాకు వెల‍్లడించారు.

హైదరాబాద్‌లోని మీర్‌ ఆలం మండి ప్రాంతానికి చెందిన మీర్‌ షబ్బీర్‌ అలీ మహబూబ్‌నగర్‌ నుంచి హోండా యాక్టివాపై జడ్చర్ల వైపు వెళ్తుంటే రూరల్‌ ఎస్‌ఐ ఖాజాఖాన్‌ ఏనుగొండ దగ్గర అతణ‍్ణి పట్టుకున్నారు. పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువెళ్లి విచారణ చేశారు. హైదరాబాద్‌కు చెందిన ఫైజల్‌ అనే వ్యక్తితో కలిసి షబ్బీర్‌ అలీ గత మూడు నెలల కాలంలో హైదరాబాద్‌లోని రాచకొండ పరిధిలో చోరీ చేసిన 15ద్విచక్ర వాహనాలు, మహబూబ్‌నగర్‌లో చేసిన రెండు ద్విచక్ర వాహనాల చోరీల గురించి  విచారణలో అంగీకరించాడు. చోరీ చేసిన 17వాహనాలను జిల్లా కేంద్రంలోని సద్దలగుండు ప్రాంతానికి చెందిన నదీం ఇంట్లో ఉంచాడు. వాటిని ఇప్పటికే వేరు వేరుగా 17మందికి ఒక్కొక్కరికి రూ.25వేల చొప్పున విక్రయించాడు. వాటిని వారం రోజుల్లో తీసుకువెళ్లాలని చెప్పాడు. ఈ క్రమంలోనే అతను పోలీసులకు పట్టుపడటంతో నదీం ఇంట్లో ఉంచిన 17యాక్టివ వాహనాలను రికవరీ చేశారు. వాటి విలువ రూ.10లక్షల 20వేలు ఉంటుందని ఎస్పీ తెలిపారు. 

రికవరీ ఎజెంట్‌ అనుభవంతోనే
హైదరాబాద్‌లోని చార్మినార్‌  మీర్‌ అలం మండి ప్రాంతానికి చెందిన షబ్బీర్‌ అలీ గతంలో మణికొండలో హోండా కంపెనీకి సంబంధించిన ద్విచక్ర వాహనాలకు రుణాలు ఇచ్చే కార్యాలయంలో రికవరీ ఎజెంట్‌గా పనిచేశాడు. హైదరాబాద్‌కు చెందిన ఫైజల్‌ అనే వ్యక్తితో పరిచయం పెంచుకుని కేవలం హోండా కంపెనీకి చెందిన యాక్టివా వాహనాలను లక్ష్యం చేసుకుని చోరీలు చేయడం మొదలుపట్టి పోలీసులకు పట్టుబడ్డాడు. అయితే షబ్బీర్‌ అలీ గతంలో చెన్‌ స్నాచింగ్‌ కేసులలో జైలు శిక్ష కూడా అనుభవించాడని పోలీసులు తెలిపారు.
 

మరిన్ని వార్తలు