దొంగను పట్టుకొని దేహశుద్ధి చేసిన స్థానికులు
బొమ్మనహళ్లి: అత్యంత ఖరీదైన సైకిల్ను చోరీ చేసేందుకు వచ్చిన దొంగను స్థానికులు సీసీ కెమెరా ద్వారా పట్టుకొని దేహశుద్ధి చేశారు. ఈఘటన బెంగళూరులోని సుబ్రహ్మణ్య నగరలో ఈనెల 3న చోటు చేసుకుంది. సుబ్రహ్మన్య నగర పోలీసుల కథనం మేరకు.. ఓ దొంగ ఈ నెల 3న సుబ్రహ్మణ్య నగరలో చోరీ కోసం రెక్కీ నిర్వహించాడు.
వెంకటేష్ అనే వ్యక్తి ఇంటి ఆవరణలో ఖరీదైన సైకిల్ అతని కంటపడింది. సాయంత్రం 5.55 గంటల సమయంలో కట్టర్ సహాయంతో తాళం తొలగించి సైకిల్ను చోరీ చేస్తుండగా యజమానులు సీసీ కెమెరాద్వారా గుర్తించి కేకలు వేస్తూ బయటకు వచ్చారు. భయాందోళనకు గురైన దుండగులు అక్కడే కారు కింద దాక్కున్నాడు. అతన్ని పట్టుకున్న స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. నిందితుడు తన పేరు కల్లెష్ అని ఒక సారి, మల్లెష్ అని మరోసారి చెబుతున్నాడని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది.