దొంగను పట్టించిన 'చెప్పు'

26 Jul, 2019 15:26 IST|Sakshi

కోల్‌కతా : సేల్స్‌ ఎగ్జిక్యూటివ్ ఇంట్లో చొరబడి విలువైన రెండు సెల్‌ఫోన్లు, నగదును తస్కరించి పారిపోయిన దొంగను కేవలం 40 నిమిషాల వ్యవధిలో పట్టుకున్న ఘటన బుధవారం కోల్‌కతాలోని న్యూ ఎలిపోర్‌లో చోటుచేసుకుంది. కాగా, అతను వేసుకునే 'చెప్పే'  అతన్ని పట్టించడం విశేషం.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ..19 ఏళ్ల షేక్‌ రాజేష్‌ అలియాస్‌ రాజు బుధవారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో అరిందామ్‌ చటర్జీ ఇంటికి దొంగతనానికి వచ్చాడు. ఆ సమయంలో మెలుకువగా ఉన్న చటర్జీ పారిపోతున్న దొంగను చూసి మాకు సమాచారమందించినట్లు పోలీసులు పేర్కొన్నారు.  డ్రైనేజ్‌ పైప్‌ ద్వారా మొదటి అంతస్తుకు చేరుకున్న రాజేష్‌ , కిటికి గ్రిల్‌ను ఊడదీసి ఇంట్లోకి ప్రవేశించినట్లు తెలిపారు. అయితే గోడ దూకి పారిపోతున్న సమయంలో అతని కాలికున్న చెప్పు అక్కడే పడిపోయింది.

ఈ నేపథ్యంలో నిందితుని కోసం గాలిస్తున్న పోలీసులకు, అటుగా వెళుతున్న యువకుడు ఒకే చెప్పుతో నడవడం అనుమానమొచ్చింది. వెంటనే పోలీసులు అతను వేసుకున్న చెప్పును పరిశీలించగా, చటర్జీ ఇంట్లో వదిలేసిన చెప్పు, ఇది ఒకటిగా తేలినట్లు స్పష్టం చేశారు. రాజేష్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు