ఇంట్లో చొరబడి కత్తితో బెదిరించి..

19 Aug, 2019 10:49 IST|Sakshi
ఆవేదన వ్యక్తం చేస్తున్న బాధితురాలు కృష్ణకుమారి

సాక్షి, ఖమ్మం : నగరంలోని ఖమ్మంఅర్బన్‌ పోలీస్‌ స్టేషన్‌కు కూత వేటు దూరంలో ఉన్న శ్రీనగర్‌కాలనీలో ఆదివారం పట్టపగలే చోరీ జరిగింది. ఇంట్లోకి చొరబడిన ఆగంతకుడు కత్తితో మహిళను బెదిరించి మెడలోని బంగారు గొలుసును అపహరించాడు. బాధితురాలు, స్థానికుల కథనం ప్రకారం.. జవ్వాది హనుమంతురావు అనే వ్యక్తి శ్రీనగర్‌కాలనీలోని రోడ్‌నంబర్‌–3లో నివాసం ఉంటున్నాడు. అదే రోడ్డులో ఇంటికి కొంత దూరంలో మిల్క్‌ పార్లర్‌ నడుపుతున్నాడు. రోజులాగే ఆదివారం కూడా దుకాణానికి వెళ్లాడు. ఇంట్లో ఉన్న భార్య కృష్ణకుమారి వంట పనులు చేస్తోంది. ఈ క్రమంలో ఓ అగంతకుడు గోడ దూకి ఇంట్లోకి చొరబడ్డాడు. నోరుమూసి మెడపై కత్తి పెట్టి మెడలో బంగారం గొలుసు లాక్కున్నాడు. గోల చేస్తే చంపుతానని బెదిరించి పక్కనే ఉన్న క్లాత్‌ను నోటికి కట్టి గోడ దూకి పరారయ్యాడు. హఠత్పారిణామంతో షాక్‌కు గురైన కృష్ణకుమారి కొద్ది సేపటికి తెరుకోని కేకలు వేసింది.

స్థానికులు వచ్చేసరికే దొంగ ఉడాయించాడు. పట్టపగలు, జనసంచారం ఉన్న ప్రాంతంలో.. ఆదివారం సెలవు దినంతో అంతా ఇంటిపట్టున ఉన్న సమయంలో చోరీ జరగడం చర్చానీయాంశంగా మారింది.  అగంతకుడు ఇంతకుముందు చూసి న వ్యక్తిలాగే ఉన్నాడని బాధితురాలు తెలిపింది. 7 తులాల గొలుసు అపహరించాడని వాపోయింది. సుమారు 2.5 లక్షల విలువ ఉంటుందని అంచనా.  సమాచారం అందుకున్న పోలీసులు చోరీ జరిగిన ఇంటి పరిసరాలను పరిశీలించారు. పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్‌లోని సీసీ కెమెరా పుటేజీని పరిశీలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వారం రోజుల క్రితం అదే ప్రాంతంలో ఓ టీచర్‌ ఇంట్లో రాత్రి వేళ చోరీ ప్రయత్నం జరిగింది. టీచర్‌ గుర్తించి కేకలు వేయడంతో అగంతకుడు పారిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. 

మరిన్ని వార్తలు