చైతన్యపురిలో దొంగల హల్‌చల్‌

12 Jan, 2019 09:31 IST|Sakshi
సీసీ కెమెరా పుటేజీలో నిందితులు

అపార్టుమెంట్‌లో చోరీ యత్నం

పట్టుకోబోయిన వాచ్‌మన్‌పై దాడి

చైతన్యపురి: చైతన్యపురి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దొంగలు హల్‌చల్‌ చేశారు. అపార్టుమెంట్‌లో చోరీకి యత్నించగా, వారిని పట్టుకోబోయిన వాచ్‌మన్‌పై రాళ్లతో దాడిచేసి పరారయ్యారు. ఇన్‌స్పెక్టర్‌ సుదర్శన్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మోహన్‌నగర్‌లోని మల్లిక మెట్రో మనోహర్‌ అపార్ట్‌మెంటులో గురువారం రాత్రి నలుగురు అగంతకులు రెండో ఫ్లోర్‌లోని గన్‌శ్యాంకు చెందిన 203 ఫ్లాట్‌ తాళాలు పగుల గొట్టి లోపలికి జొరబడ్డారు.

వారిలో ఒకరు వాచ్‌మన్‌ అనిల్‌కుమార్‌ ఇంటికి  బయటి నుంచి గడియ పెట్టి అక్కడే కాపలాకాస్తున్నాడు. అలికిడి విన్న వాచ్‌మన్‌ బయటికి వచ్చేందుకు ప్రయత్నించగా బయట గడియపెట్టి ఉండటంతో కేకలు వేశాడు. దీంతో బయటికి వచ్చిన ఓ మహిళ అగంతకుడుని గుర్తించి కేకలు వేయటంతో పై అంతస్తునుంచి నలుగురు కిందకు దిగి వచ్చారు. వారిని పట్టుకునేందుకు ప్రయత్నించిన వాచ్‌మన్‌ అనిల్‌పై రాళ్లతో దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యారు.  వాచ్‌మెన్‌ పిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. సీసీ కెమెరలు పరిశీలించగా ఐదుగురు వ్యక్తులు చోరీకి యత్నిచినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు