నర్సరీ వ్యాపారి పై కత్తులతో దాడి

4 Sep, 2018 12:03 IST|Sakshi
కత్తిపోట్లను చూపిస్తున్న బాధితుడు

సూర్యాపేటక్రైం : పూటుగా మద్యం సేవించిన ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు ఓ వ్యక్తిపై కత్తులతో దాడి చేసిన ఘటన సూర్యాపేట జిల్లా కేం ద్రంలోని అమ్మగార్డెన్‌ సమీపంలో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. వివరాలు.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం గ్రామానికి చెందిన పెరుమాళ్ల శ్రీనివాస్‌గుప్తా గుజరాత్‌లో నర్సరీ వ్యాపారం చేస్తున్నాడు. ఇటీవల స్వగ్రామానికి చేరుకుని పని పూర్తిచేసుకుని, ఆదివారం రాత్రి గుజరాత్‌కు తన సొంత కారు (ఏపీ 37సీవీ 2444)లో బయలుదేరాడు. ఖమ్మం మీదుగా సూర్యాపేటలోని అమ్మగార్డెన్‌ సమీపంలోకి అర్ధరాత్రి చేరుకున్నాడు. అక్కడ కారు ఆపి మూత్రవిసర్జన చేస్తుండగా రెడ్‌ పల్సర్‌ బైక్‌పై ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు శ్రీనివాస్‌గుప్తా వద్దకు వచ్చా రు.

ఇక్కడ మూత్ర విసర్జన చేయరాదని దబాయించి దాడిచేశారు. అంతేకాకుండా.. నీ వద్ద ఎంత నగదు ఉందంటూ.. ఆ నగదు మొత్తం ఇవ్వాలని బెదిరించారు. తన వద్ద డబ్బులు లేవని బాధితుడు చెప్పినా వినకుండా కిందపడేసి పైజేబులో ఉన్న రూ.5 వేల నగదును అపహరించుకెళ్లారు. అంతటితో ఆగకుండా కత్తులతో రెండు చోట్ల పొడిచారు. తేరుకున్న శ్రీనివాస్‌ వెంటనే 100కు ఫోన్‌ చేసి విషయాన్ని వివరించాడు. స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు.  శ్రీనివాస్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు