సంతకెళ్తే చింతే!  

3 Jul, 2018 13:47 IST|Sakshi
నాగిరెడ్డిపేట మండలకేంద్రంలోని వారంతపుసంత జరుగుతున్న ప్రాంతం 

నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి) : నాగిరెడ్డిపేట మండలకేంద్రం గోపాల్‌పేటలో ప్రతి సోమవారం జరిగే సంతకెళ్లే ప్రజలకు చింతే మిగులుతోంది. స్మార్ట్‌ ఫోన్లే టార్గెట్‌గా దొంగలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. కూరగాయల కొనుగోలుకు వస్తున్న వారిని ఏమార్చి దర్జాగా ఫోన్లను అపహరిస్తున్నారు. కేవలం స్మార్ట్‌ఫోన్లే లక్ష్యంగా చేసుకుంటున్న చోరులు వారంతపు సంతను వేదికగా మార్చుకుంటున్నారు.

సంత జరిగే ప్రాంతం ఇరుగ్గా ఉండడంతో చోరులు వారి హస్తలాఘవాన్ని ప్రదర్శించేందుకు అనువుగా మారుతుంది. ప్రతీ వారం జరిగే సంతలో నలుగురైదుగురి ఫోన్లను అపహరిస్తున్నారు. దొంగలు కొట్టేస్తున్న ఒక్కో ఫోన్‌ విలువ రూ.10వేల పైచిలుకే ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ల అపహరణకు అలవాటు పడిన దొంగలు ప్రతి సోమవారం గోపాల్‌పేట వారంతపు సంతలో దర్జాగా తిరుగుతూ వారి చోరీలకు పాల్పడుతున్నారు.

మండల కేంద్రంలో జరిగే వారంతపు సంత కు మండలంలోని నాగిరెడ్డిపేట, లింగంపల్లి, తాం డూర్, వెంకంపల్లి, మాటూర్, మాసాన్‌పల్లి, జప్తిజాన్కంపల్లి, బొల్లారం, రాఘవపల్లి, ధర్మారెడ్డి, కన్నారెడ్డి, చీనూర్, వాడి, గోలిలింగాల, మాల్తుమ్మెద, పోచారం, వదల్‌పర్తితోపాటు లింగంపేట మండలంలోని లోంకలపల్లి, శెట్పల్లి సంగారెడ్డి గ్రామాల నుంచి వందల సంఖ్యలో జనాలు వ స్తుంటారు.

సంత జరిగే ప్రాంతం ఇరుకుగా ఉండడంతో గుర్తు తెలియని వ్యక్తులు కూరగాయలు కొనుగోలు చేసినట్లు నటిస్తూ, ఏమరుపాటుగా ఉండే వారి ఫోన్లను తస్కరిస్తున్నారు. సోమవారం జరిగిన సంతలో శెట్పల్లిసంగారెడ్డికి చెందిన ఓ వ్య క్తి రెండ్రోజుల క్రితం రూ.15 వేలు వెచ్చించి కొను గోలు చేసిన స్మార్ట్‌ఫోన్‌ను ఎత్తుకెళ్లారు. దీంతో పాటు కన్నారెడ్డికి చెందిన రాజుకు చెందిన ఫోన్‌ను సైతం దొంగిలించారు.

గత వారం ఇదే సంతలో గోలిలింగాలకు చెందిన పండరి, సంతుకు చెందిన ఫోన్లతో పాటు మరో ఇద్దరి ఫోన్లను సైతం అపహరించుకెళ్లారు. అంతకు ముందు వారం సైతం ముగ్గురి ఫోన్లను దొంగిలించారు. మరోవైపు, వారంతపుసంతలో ఫోన్లను పోగొట్టుకుంటున్న వారు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడంలేదు.

సంతలో ఫోన్‌ను పోగొట్టుకోవడం చిన్నతనంగా భావిస్తున్న బాధితులు ఫిర్యాదు చేయకుండా మిన్నకుండి పోతున్నారు. దీన్ని అదునుగా చేసుకుంటున్న దొంగలు ప్రతీ వారం రెచ్చిపోతున్నారు. పోలీసులు నిఘా పెడితే వారి ఆగడాలకు కొంతవరైకనా అడ్డుకట్ట పడుతుంది.

మరిన్ని వార్తలు