సాక్షి, హైదరాబాద్: నగరంలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ ఇంట్లోని దంపతులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటన రాజేంద్రనగర్లోని తిరుమలనగర్లో గురువారం అర్ధరాత్రి తర్వాత జరిగింది. వివరాలు.. రాజేంద్రప్రసాద్ అగర్వాల్ ఇంట్లో దొంగలు పడ్డారు. అగర్వాల్, ఆయన భార్యపై దాడి చేసి 40 తులాల బంగారాన్ని, 50 లక్షల రూపాయల నగదును దోచుకెళ్లారు. ఈ ఘటనలో అగర్వాల్ ప్రాణాలు కోల్పోగా తీవ్ర గాయాలతో ఆయన భార్య ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్నామని ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని సాధ్యమైనంత త్వరగా కేసును ఛేదిస్తామని చెప్పారు. పోస్టుమార్టం అనంతరం మిగతా వివరాలు వెల్లడవుతాయని అన్నారు. కాగా, మృతుడి ఒంటిపై ఎలాంటి గాయాలు లేవు. అతను ఆస్తమా వ్యాదిగ్రస్తుడు.