కంట్లో కారం చల్లి...తుపాకితో బెదిరించి..

11 Mar, 2018 09:57 IST|Sakshi
దారి దోపిడి జరిగిన స్థలం

కొత్తూర్‌లో దారిదోపిడి

సాక్షి, కొత్తూర్‌ : దారి కాచి రోడ్డుపై వెళుతున్న వ్యక్తి కంట్లో కారం చల్లి, తుపాకితో బెదిరించి రెండు లక్షలు దోచుకున్న ఘటన కలకలం రేపింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా కొత్తూర్‌లో చోటుచేసుకుంది.  కొత్తూర్‌ మండల కేంద్రంలోని మద్దూర్ పంచాయతీ బిక్య తాండకు చెందిన దశరథ్ గత కొన్ని నెలలుగా ఆన్‌లైన్‌ మనీ టాన్స్‌ఫర్‌ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఈ శనివారం రాత్రి పదిగంటల సమయంలో అతను పనులు ముగించుకుని బైక్‌పై ఇంటికి బయలుదేరి వెళ్లాడు.

గూడూరు పంచాయతీ రాగ్య.. కమల తాండ మధ్యన  రోడ్డుకు అడ్డంగా రాళ్లు కనిపించడంతో అతను బైక్‌ ఆపాడు. అప్పటికే అక్కడ దారికాచి ఉన్న దుండగులు.. అతనిపై కారం చల్లి సుమారు రెండు లక్షలు దోచుకున్నారు. తిరగబడిన దశరథ్‌ను తుపాకితో బెదిరించగా అతను కేకలు వేసుకుంటూ సమీపంలోని తాండలోకి పరుగులు తీశాడు. అది గమనించిన కొందరు అతనికి సహాయంగా దొంగల కోసం వెతికారు. దీంతో ఆ ముఠాకి చెందిన ఒకడు పట్టుబడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి ముఠా సభ్యుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

మరిన్ని వార్తలు