ఉన్నా... సున్నా!

16 Jul, 2018 10:40 IST|Sakshi

తెలివి మీరుతున్న ప్రాపర్టీ అఫెండర్స్‌

ఆధారాలు దొరక్కుండా పలు జాగ్రత్తలు

తాజాగా డీవీఆర్‌లు ఎత్తుకుపోతున్న వైనం

సీసీ కెమెరాలున్నా ఫలితం శూన్యం

సాక్షి, సిటీబ్యూరో: ఈ ఏడాది మార్చ్‌లో... పేట్లబురుజులోని బంగారు నగల తయారీ కార్ఖానాలో మూడు కేజీలకు పైగా పసిడి బందిపోటు దొంగతనానికి పాల్పడిన అంతరాష్ట్ర ముఠా డిజిటల్‌ వీడియో రికార్డర్‌ (డీవీఆర్‌) ఎత్తుకుపోయింది. 

శనివారం రాత్రి...
అబ్దుల్లాపూర్‌మెట్‌లోని నవదుర్గ వైన్స్‌లో షెట్టర్‌ పగులకొట్టి దొంగతనం చేశారు. ఇక్కడ నుంచి రూ.8,600 నగదు, కొన్ని మద్యం బాటిళ్లు చోరీ చేసిన దొంగలు తమ వెంట డీవీఆర్‌ కూడా పట్టుకుపోయారు.  సైబర్‌ క్రిమినల్స్‌ మాత్రమే కాదు... సొత్తు సంబంధ నేరాలు చేసే నేరగాళ్లు సై తం నానాటికీ తెలివి మీరుతున్నారు. నేరానికి సం బంధించి ఎలాంటి ఆధారాలు మిగలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందులో భాగమే  డీవీఆర్‌లు మాయం చేయడం. ఇటీవల అనేక ఉదంతాల్లో ఈ ధోరణి కనిపించిందని పోలీసులు చెబున్నారు. ప్రజలు కొన్ని కనీస జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ కేటుగాళ్లకు చెక్‌ చెప్పవచ్చని సూచిస్తున్నారు. 

సమయానుకూలంగా ‘స్మార్ట్‌’గా...
ఏదైనా నేరం జరిగినప్పుడు చిన్న ఆధారం వదలకూడదని నేరగాళ్లు ఎత్తులు వేస్తుంటారు. ఇందులో భాగంగా ఒకప్పుడు తమ వేలి, కాలి ముద్రలు దొరక్కుండా జాగ్రత్తపడేవారు. అప్పట్లో పోలీసుల దర్యాప్తునకు ఇవే కీలకం కావడంతో చేతికి గ్లౌజులు, కాళ్లకు ప్లాస్టిక్‌ కవర్లు కట్టుకుని ‘రంగం’లోకి దిగేవాళ్ళు. ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు తీరు మారింది. అనేక కేసుల్లో సీసీ కెమెరాలే కీలక ఆధారాలు ఇస్తున్నాయి. దీంతో దొంగలు తొలినాళ్ళల్లో సీసీ కెమెరాలకు చిక్కకుండా ముఖానికి మాస్క్‌లు, ముసుగులు వేసుకునే వారు. ఆపై వాటిని ధ్వంసం చేయడం చేశారు. ఈ ‘కాలక్రమంలో’ భాగంగా ఇటీవల కాలంలో కనిపిస్తున్న ట్రెండ్‌ డీవీఆర్‌ల చోరీ.

ఎత్తుకుపోతే అంతే...
ప్రస్తుతం దుకాణదారులతో పాటు ఇంటి యజమానులూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే పబ్లిక్‌ ప్లేసుల్లో పూర్తి స్థాయిలో ఇవి అందుబాటులోకి రాలేదు. ప్రభుత్వం చేపడుతున్న సేఫ్‌ అండ్‌ స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టులో భాగంగా ఇవి ఏర్పాటవుతున్నాయి. ప్రజలు, వ్యాపారులు ఏర్పాటు చేసుకునే సీసీ కెమెరాలకు సంబంధించి డీవీఆర్‌ అత్యంత కీలకమైంది. సీసీ కెమెరాలు రికార్డు చేసే ఫీడ్‌ మొత్తం అందులోనే నిక్షిప్తమవుతుంది. చోరీ చేసిన నేరగాళ్లు దీన్ని కూడా పట్టుకుపోతే దర్యాప్తునకు అవసరమైన ఆధారాలు చెరిగిపోయినట్లే. చోరీ జరిగిన ప్రాంతానికి చుట్టుపక్కల, సమీపంలో ఇతర సీసీ కెమెరాలు లేకపోతే దాదాపు ఆధారాలు కనుమరుగైనట్లే. అబ్దుల్లాపూర్‌మెట్‌ వైన్‌ షాపులో చోరీ విషయంలో ఇదే జరి గింది. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకున్న పో లీసుల విభాగం కొన్ని కీలక సూచనలు చేస్తోంది. 

ఫోన్‌లో భద్రం...
సీసీ కెమెరాల్లో అత్యధికం ఐపీ బేస్ట్‌ పరిజ్ఞానంతోపని చేస్తున్నాయి. యజమానులు తాము ఎక్కడ ఉన్నప్పటికీ తమ ఇంట్లో, దుకాణంలో ఏ జరుగుతోందో చూడటానికి అనువుగా ఇంటర్‌నెట్‌ ఆధారంగా పని చేసే వీటిని ఏర్పాటు చేసుకుంటున్నారు.

అనునిత్యం వీరి సెల్‌ఫోన్‌తో కనెక్ట్‌ అయి ఉండే ఈ కెమెరాల ఫీడ్‌ను యజమానులు ఎక్కడున్నా చూడగలుగుతున్నారు. దీనిని సద్వినియోగం చేసుకుంటూ, సెల్‌ఫోన్స్‌ లేదా మెమొరీ కార్డ్స్‌ సామర్థ్యం పెంచుకుంటూ మరికొన్ని చర్యలు తీసుకోవాలని పోలీసులు కోరుతున్నారు. ఫోన్‌లో కనిపించే ఫీడ్‌ కనీసం 48గంటలపాటుసేవ్‌ అయ్యేలా సెట్టింగ్‌ చేసుకో వాలనిసూచిస్తున్నారు. అలా చేయడంద్వారాచోరీ చేసిన తర్వాత తమ వెంట డీవీఆర్‌నుఎత్తుకుపోయినా సెల్‌ఫోన్‌లో రికార్డు అయిఉండే ఫీడ్‌ ఆధారంగా దర్యాప్తు ముందుకు వెళ్తుంది. 

పక్క దుకాణంలో ఏర్పాటు...
సెల్‌ఫోన్‌లో సేవింగ్‌ విధానం ఇళ్లల్లో ఉన్న సీసీ కెమెరాలకు సరిపోతుంది. అదే దుకాణాల విషయానికి వస్తే అన్నింటి ఫీడ్‌ను ఇలా సేవ్‌ చేసుకోవడం సాధ్యం కాదు. కెమెరాల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు ఆ ఫీడ్‌ భద్రపరచడానికి మెమొరీ కార్డ్‌ సామర్థ్యం చాలకపోవచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ‘పక్కన ఏర్పాట్లు’ చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ఒక దుకాణం లో ఉన్న సీసీ కెమెరాలకు సంబంధించిన డీవీఆర్‌ పక్కన ఉన్న మరో దుకాణంలో ఉండేలా చూసు కోవాలని కోరుతున్నారు. ఇలా చేయడం ద్వారా ఒకవేళ చోరీ జరిగి దొంగలు ఆ దుకాణంలోని డీవీఆర్‌ ఎత్తుకుపోయినా ఇబ్బంది ఉండదని వివరిస్తున్నారు. పక్కపక్క ఇళ్ళల్లో చోరీలు తరచుగా వెలుగు చూస్తున్నా... దుకాణాల్లో ఈ తరహాలో జరగడం అత్యంత అరుదని, దీంతో ఈ విధానం వల్ల ఫలితాలు ఉంటాయని స్పష్టం చేస్తున్నారు. ఈ కోణంలో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. 

మరిన్ని వార్తలు