దొంగల బీభత్సం: ఆరు ఇళ్లలో చోరి

17 Jan, 2020 11:00 IST|Sakshi
డాగ్‌ స్క్వాడ్‌తో వివరాలు సేకరిస్తున్న పోలీసులు 

సాక్షి, పెద్దకడబూరు(కర్నూలు): మండలంలోని బసలదొడ్డి గ్రామంలో మంగళవారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని దోపిడీలకు తెగబడ్డారు. వలస వెళ్లి పనులు చేసుకొని తెచ్చుకున్న సొమ్మును లూటీ చేశారు. చివరకు మోటార్‌ సైకిల్‌ను కూడా ఎత్తుకెళ్లారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని బసలదొడ్డి గ్రామానికి చెందిన జారబండ హనుమంతు వలసకు వెళ్లి డబ్బులు సంపాందించుకొచ్చాడు. కుమారుడి పెళ్లి సంబంధం కోసం వేరే గ్రామానికి వెళ్లడంతో ఇంట్లో రూ.1.20లక్షలు నగదుతో పాటు తులం బంగారు ఎత్తుకెళ్లారు. అలాగే హైమావతి ఎమ్మిగనూరు జాతరకు వెళ్లింది. ఇంట్లో ఎవ్వరూ లేకపోవడంతో 4తులాల బంగారు, 10తులాల వెండి, రూ. 20వేల నగదు, రామాంజనేయులు కుటుంబంతో సహా వలస వెళ్లాడు.

ఆయన ఇంట్లో 3తులాల బంగారు, మల్లేష్‌ కూడా వలస వెళ్లడంతో ఆయన ఇంటికి తాళం వేసి ఉండటం చూసి 36తులాల వెండితో పాటు రూ.15వేల నగదు, తాయమ్మ ఇంట్లో రూ. 20వేల నగదుతో పాటు జత కమ్మలను గుర్తు తెలియని దుండగులు చోరీ చేశారు. వెళ్తూ వెళ్తూ మోహన్‌ రెడ్డి అనే వ్యక్తి ఇంటి ఎదుట ఉంచిన మోటార్‌ సైకిల్‌ను ఎత్తుకెళ్లారు. చివరగా ఈడిగ రామాంజి ఇంట్లో జొరబడినా ఏమీ లేకపోవడంతో వెనుదిరిగారు. అయితే ఈ ఇళ్లన్నీ ఊరికి చివరగా ఉండటం, జన సంచారం తక్కువగా ఉండటం దొంగలకు కలిసి వచ్చింది. అయితే  మొత్తం నాలుగు ఇళ్లల్లో రూ.1,10,000 నగదు, 6.5తులాల బంగారం, ఒక ద్విచక్ర వాహనం చోరీకి గురైనట్లు సీఐ ఈశ్వరయ్య, ఎస్‌ఐ అశోక్‌ తెలిపారు. డాగ్‌స్క్వాడ్, వేలిముద్రల నిపుణుల సహకారంతో వివరాలు సేకరించామని, త్వరలోనే దొంగలను పట్టుకుంటామని వారు స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు