డబుల్‌ బారెల్‌ గన్‌తో బెదిరింపులు

17 Feb, 2019 09:15 IST|Sakshi
నిందితులు (ఇన్‌సెట్‌) స్వాధీనం చేసుకున్న డబుల్‌బారెల్‌ గన్‌

రూ.7కోట్ల భూ రిజిస్ట్రేషన్‌ వివాదం

8 మంది అరెస్టు

నేరేడ్‌మెట్‌: భూ రిజిస్ట్రేషన్‌ వ్యవహారంలో డబుల్‌ బారెల్‌ గన్‌తో బెదిరించిన సంఘటనలో నేరేడ్‌మెట్‌ పోలీసులు 8మందిని అరెస్టు చేసి, ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నట్టు కుషాయిగూడ ఏసీపీ శివకుమార్‌ పేర్కొన్నారు. శనివారం నేరేడ్‌మెట్‌ సీఐ నర్సింహ్మాస్వామితో కలిసి ఏసీపీ మల్కాజిగిరి డీసీపీ కార్యాలయంలో విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఏసీపీ తెలిపిన మేరకు.. నేరేడ్‌మెట్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలోని మధురానగర్‌లో రామ్‌నర్సింహకు సిమెంట్‌ దుకాణం ఉంది. మహేశ్వరం మండలం పెండ్యాల గ్రామంలో రామ్‌నర్సింహభార్య పేరుతో  14వేల చదరపు గజాల స్థలం ఉంది. గత ఏడాది సెప్టెంబర్‌లో అమీర్‌పేట్‌ నర్సింహులు మధ్యవర్తిగా మణికొండకు చెందిన పొలిశెట్టి పెండ్యాలలో ఉన్న భూమి కొనుగోలుకు సిమెంట్‌ వ్యాపారి రామ్‌నర్సింహతో రూ.7కోట్లకు ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా ఒప్పందం సమయంలో 25శాతం ప్రకారం రూ.1కోటి నగదు, మరో కోటి బ్యాంకు ద్వారా పొలిశెట్టి చెల్లించాడు. మరో 25శాతం గత ఏడాది డిసెంబర్‌లో, ఈ ఏడాది ఫిబ్రవరిలో రిజిస్ట్రేషన్‌ సమయంలో మిగితా 50శాతం డబ్బులు చెల్లిస్తానని పొలిశెట్టి ఒప్పందం సందర్భంగా చెప్పాడు. 

వాయిదా ప్రకారం డబ్బులు చెల్లించాలని రామ్‌నర్సింహ పలుసార్లు అడిగినా ఇప్పుడుఅప్పుడూ అంటూ పొలిశెట్టి కాలయాపన చేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి సుమారు 8గంటల ప్రాంతంలో తనతోపాటు మరో 7మంది అనుచరులను వెంట బెట్టుకొని రెండు ఇన్నోవా కార్లలో మధురానగర్‌లోని సిమెంట్‌ దుకాణం వద్దకు వచ్చాడు. ఆ సమయంలో రామ్‌నర్సింహ దుకాణంలో లేరు. గుమాస్తా పాండును పొలిశెట్టి, అనుచరులు ‘మీ సార్‌ ఎక్కడ...భూమి రిజిస్ట్రేషన్‌ చేయకుంటే బాగుండద’ని.. డబుల్‌ బారెల్‌ గన్‌తో భయభ్రాంతులకు గురి చేశారు. గుమాస్తా వెంటనే యజమానికి ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చాడు. అనంతరం రామ్‌నర్సింహ తన న్యాయవాది ద్వారా 100కు ఫోన్‌ చేశాడు. వెంటనే పెట్రోలింగ్,నేరేడ్‌మెట్‌ పోలీసులు రంగంలోకి దిగి సిమెంట్‌ దుకాణం వద్ద ఉన్న పొలిశెట్టితోపాటు అతని అనుచరులు చెగూరి నర్సింహ, చంద్రమణి త్రిపాఠి(యూపీ లైసెన్స్‌–ఆయుధం కలిగిన వ్యక్తి), రామకిషన్,సునీల్‌కుమార్, బాలకిషన్, యూసుఫ్‌ఖాన్, ముక్తార్‌(బౌన్సర్లు)లను అదుపులోకి తీసుకున్నారు. భూయజమాని ఫిర్యాదు మేరకు  బెదిరింపులు, ఆరŠమ్స్‌సెక్షన్ల కింద కేసు నమోదు చేసి 8మందిని అరెస్టు చేసి, ఆయుధంతోపాటు 6రౌండ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. బంజారాహిల్స్‌ ఠాణాలో గన్‌ గురించి  రిపోర్టు చేసినట్టు నిందితుడు తెలిపారని, అసలు లైసెన్స్‌ ఉందా లేదా?అని విచారణ చేస్తున్నామని, ఉంటే రద్దు చేయాలని పై అధికారులకు లేఖ రాస్తామని ఏసీపీ వివరించారు.   

మరిన్ని వార్తలు