ఢిల్లీలో గ్యాంగ్‌వార్‌.. ముగ్గురు మృతి

18 Jun, 2018 15:10 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ తుపాకి కాల్పులతో దద్దరిల్లింది. పట్టపగలే నడి రోడ్డుపై రెండు ముఠాలు ఎదురుకాల్పులకు పాల్పడ్డాయి. ఈ ఘటనలో ఓ మహిళతో పాటు మరో ఇద్దరు ముఠా సభ్యులు మృతి చెందారు. ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర ఢిల్లీలోని బురారి ప్రాంతంలో సోమవారం ఉదయం 10 గంటలకు రెండు గ్యాంగ్‌లు వాహనాల్లో వచ్చాయి. ఉదయం 10.15 గంటల సమయంలో ఒకేసారి రెండు ముఠాల సభ్యులు పరస్పరం కాల్పులకు పాల్పడ్డారు.

దీంతో అక్కడ ఉన్న ఓ స్థానిక మహిళకు బుల్లెట్‌ తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఇద్దరు ముఠా సభ్యులు కూడా ఈ కాల్పుల్లో మృతి చెందారు. కాగా కాల్పులకు పాల్పడిన ముఠాలు గోగి గ్యాంగ్‌, టిల్లు గ్యాంగ్‌లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కాల్పుల్లో మృతి చెందిన ఇద్దరు వ్యక్తులు టిల్లు గ్యాంగ్‌ సభ్యులుగా గుర్తించారు. సీసీటీవీ పుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

>
మరిన్ని వార్తలు