-

డివైడర్‌ను ఢీకొన్న డీసీఎం వ్యాన్‌: ముగ్గురి మృతి

23 Nov, 2019 04:43 IST|Sakshi

మార్బుల్స్‌ మధ్య నలిగిపోయిన కూలీలు

అవుటర్‌ సర్వీస్‌ రోడ్డులో టోల్‌గేట్‌ వద్ద ఘటన

పహాడీషరీఫ్‌: డీసీఎం వ్యాన్‌ అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టిన ఘటనలో ముగ్గురు కూలీలు మార్బుల్స్‌ మధ్య నలిగిపోయి దుర్మరణం పాలయ్యారు. పహాడీషరీఫ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శుక్రవారం చోటు చేసుకున్న ఘటన వివరాలిలా ఉన్నాయి. శంషాబాద్‌ నుంచి డీసీఎం వ్యాన్‌ (ఏపీ 28 టీఏ2410) కల్వకుర్తి వైపు మార్బుల్స్‌ లోడ్‌తో ఏడుగురు కార్మికులను ఎక్కించుకుని వెళుతోంది. ఓఆర్‌ఆర్‌ ఎగ్జిట్‌ రోడ్డు తుక్కుగూడ గ్రామం వద్దకు రాగానే డీసీఎం డ్రైవర్‌ నియంత్రణ కోల్పోయి వాహనాన్ని టోల్‌గేట్‌ డివైడర్‌కు ఢీ కొట్టాడు. ఈ ఘటనలో షాపూర్‌ గ్రామానికి చెందిన రాములు(32), సాయిలు(40), కూకట్‌పల్లికి చెందిన శ్రీను(35)లు మార్బుల్స్‌ మధ్య నలిగిపోయి అక్కడికక్కడే మృతి చెందారు. ఎ.సంగయ్య(50), సత్యనారాయణ(48), పండరీ (32), ఎర్ర సాయిలు(40)కు తీవ్రంగా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పహాడీషరీఫ్‌ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మరిన్ని వార్తలు