రోడ్డు ప్రమాదంలో ముగ్గురు స్నేహితులు మృతి 

1 Jun, 2020 03:25 IST|Sakshi

చేవెళ్ల: ఓ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. వీరంతా బాల్య స్నేహితులే కావడం గమనార్హం. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని మీర్జాగూడ వద్ద ఆదివారం ఓ కారు చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో మండలంలోని ఆలూరు గ్రామానికి చెందిన సార నరేశ్‌ (30), గారెల రవీందర్‌ (32), ఎన్కేతల రఘు (30) అక్కడికక్కడే మృతి చెందారు. నర్కుడ నవీన్‌ తీవ్ర గాయాలపాలయ్యాడు. 2005 సంవత్సరం టెన్త్‌ బ్యాచ్‌కు చెందిన వీరు ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో గ్రామం నుంచి నరేశ్‌కు చెందిన కారులో సరదాగా చేవెళ్లకు వచ్చారు. తిరిగి రాత్రి 7 గంటలకు గ్రామానికి పయనమయ్యారు. 10 నిమిషాల్లో గ్రామానికి చేరుకుంటారనగా.. మార్గమధ్యలో మీర్జాగూడ బస్‌ స్టేజీ దాటిన తర్వాత అతివేగంతో కారు అదుపు తప్పి రోడ్డు పక్కన మర్రిచెట్టును ఢీకొంది. దీంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు సమాచారమందించారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని ముగ్గురి మృతదేహాలను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన నవీన్‌ను ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు