ఇంటి నుంచి పారిపోయేందుకు బాలికల యత్నం

27 Mar, 2018 08:11 IST|Sakshi

గస్తీ పోలీసులకు చిక్కిన వైనం

తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌

మంగళగిరి రూరల్‌:ముగ్గురు బాలికలు వారికి నచ్చిన వారితో బతకాలనుకున్నారు. ఒకేచోట పనిచేసే ఆ ముగ్గురూ ఒక మాటగా అనుకొని అర్ధరాత్రి ఇంట్లో నుంచి పారిపోయే క్రమంలో పోలీసులకు చిక్కడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. పట్టణ పోలీసుల కథనం ప్రకారం... స్థానిక పార్క్‌ రోడ్‌ ప్రాంతానికి చెందిన ముగ్గురు బాలికలు మెయిన్‌ బజారులో ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తుంటారు. వీరు ముగ్గురూ కొద్దికాలంగా పట్టణానికి చెందిన ముగ్గురు యువకులతో స్నేహం చేస్తూ ప్రేమలో పడ్డారు.

వారితో కలసి జీవించడం కోసం ఇంట్లో నుంచి పారిపోవాలని నిశ్చయించుకున్నారు. పక్కాగా సిద్ధం చేసుకున్న ప్రణాళిక ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇళ్లలో నుంచి వచ్చేసి బస్టాండ్‌ సమీపంలో వారు ప్రేమించిన యువకుల కోసం తిరుగుతున్నారు. అదే సమయంలో రాత్రి గస్తీ నిర్వహిస్తున్న పట్టణ ఎస్‌.ఐ. బాలకృష్ణ వారి వద్దకు చేరుకుని విచారించగా, అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అయితే, ముగ్గురు  ప్రేమించిన యువకులు కూడా మైనర్‌లే కావడం విశేషం. బాలికల నుంచి ఎస్‌ఐ తల్లిదండ్రుల సమాచారం తెలుసుకుని వారిని పిలిపించి అప్పగించారు. సోమవారం ఉదయం బాలికలతో సహా తల్లిదండ్రులను పట్టణ సీఐ హరికృష్ణ, ఎస్‌ఐ బాలకృష్ణ పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపివేశారు. అయితే, ఆ ముగ్గురు యువకుల వివరాలు మాత్రం తెలియలేదు.

మరిన్ని వార్తలు