కొరాపుట్ జిల్లాలో సంఘటన
ఆందోళన చెందుతున్న ప్రజలు
జయపురం: గత ఏడాది అక్టోబర్లో కొరాపుట్ జిల్లా కుందులి సమీప సొరిసిపొదర్ ఆదివాసీ సంక్షేమ పాఠశాలలో ఓ బాలికను నలుగురు అపహరించి సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారన్న ఆరోపణల అనంతరం బాలిక అత్మహత్యకు పాల్పడిన సంఘటన నేటికీ కొరాపుట్ జిల్లా ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలను కలవరపరుస్తోంది.
తాజాగా కొరాపుట్ జిల్లా దశమంతపూర్ సమితి పొరజబొడిపొదర్ గ్రామంలోగల ఆదివాసీ సంక్షేమ పాఠశాల హాస్టల్ ఉంటున్న ముగ్గురు ఆదివాసీ విద్యార్థినులను సోమవారం ఉదయం ఎవరో అపహరించారన్న వార్త వెలుగులోకి వచ్చింది. మరోసారి కలకలం రేగింది.
కిడ్నాప్కు గురైన ముగ్గురిలో ఇద్దరు 6వ తరగతి విద్యార్థినులు కాగా మరో బాలిక 9వ తరగతి చదువుతోంది. సోమవారం ఉదయం 7గురు విద్యార్థినులు మూత్ర విసర్జనకు హాస్టల్నుంచి బయటకు వచ్చారు. ఆ సమయంలో బొలెరో వాహనంలో కొందరు వచ్చి వారి ముఖాలపై టార్చిలైట్ వేయడంతో భయంతో నలుగురు విద్యార్థినులు స్పృహ తప్పి పడిపోయారని, మిగతా ముగ్గురు విద్యార్థినులు కిడ్నాప్కు గురయ్యారని తెలుస్తోంది.
ఈ విషయం తెలుసుకున్న బాధిత బాలికల తల్లిదండ్రులు వెంటనే పొరజబెడిపొదర్ గ్రామానికి వచ్చి అందరినీ అడిగిన తరువాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధిత బాలికల తరఫున ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.