యువతిపై భర్త లైంగిక దాడి.. భార్య వీడియో

8 Feb, 2020 03:30 IST|Sakshi

మేనల్లుడితో కలసి యువతిని బెదిరించి రూ.50 లక్షల వరకు వసూలు

ముగ్గురినీ పట్టుకున్న పోలీసులు

సాక్షి, కుత్బుల్లాపూర్‌: భార్య ముందే భర్త ఓ యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. సభ్య సమాజం తలదించుకునేలా భార్య, మేనల్లుడు దాన్ని వీడియో తీశారు. ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం పెంచుకుని.. లైంగిక దాడికి పాల్పడి వీడియోలు తీసి బ్లాక్‌ మెయిల్‌ చేస్తూ అరకోటి వరకు వసూలు చేసి తప్పించుకు తిరుగుతున్న ముగ్గురిని బాచుపల్లి పోలీసులు పట్టుకున్నారు. నగరంలోని కోకాపేటకు చెందిన యువతి అమెరికాలో ఉంటోంది. కర్ణాటక బీదర్‌ ప్రాంతానికి చెందిన సంజీవరెడ్డి.. ఆమెకు 2018, జూలైలో ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం అయ్యాడు. నాటి నుంచి ఇరువురి మధ్య ఫోన్‌లు, ఫేస్‌బుక్‌ చాటింగ్‌లు ప్రారంభమయ్యాయి.

అదే ఏడాది అక్టోబర్‌ 31న అమెరికా నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన యువతిని సంజీవరెడ్డి వెళ్లి రిసీవ్‌ చేసుకుని, యువతి చెల్లెలు ఇంటి వద్ద వదిలిపెట్టి వచ్చాడు. పూర్తిగా నమ్మిన యువతికి సంజీవరెడ్డి 2రోజుల తరువాత ఫోన్‌ చేసి కూకట్‌పల్లిలోని సితార హోటల్‌కు లంచ్‌కు రావాలని కోరాడు. అక్కడ అతని భార్య కావేరి, మేనల్లుడు విశాల్‌రెడ్డిని ఆమెకు పరిచయం చేశాడు. భోజనం చేయమని కోరగా యువతి వద్దని చెప్పింది. కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఇవ్వగా తాగి అపస్మారక స్థితికి వెళ్లడంతో ఆ ముగ్గురూ సదరు యువతిని నిజాంపేట్‌లోని వారి నివాసానికి తీసుకువెళ్లారు.

ఇంట్లో ఆ యువతిపై సంజీవరెడ్డి లైంగిక దాడి చేస్తూ దాన్ని భార్య, మేనల్లుడితో వీడియోలు తీయించాడు. అప్పటి నుంచి ఆ వీడియోలు చూపి అందిన కాడికి దండుకుంటూ వస్తున్నారు. సోషల్‌ మీడియాలో పెట్టి పరువు తీస్తానని బెదిరించి 30 తులాల బంగారం, రూ.6 వేల యూఎస్‌ డాలర్లను లాక్కున్నారని సదరు యువతి పోలీసులను ఆశ్రయించింది. ఇలా రూ.50 లక్షల వరకు వసూలు చేసినట్లు బాధితురాలు గురువారం ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు బీదర్‌లో ఉన్న సంజీవరెడ్డి, అతని భార్య కావేరి, మేనల్లుడు విశాల్‌రెడ్డిని పట్టుకుని నగరానికి తీసుకొచ్చి శుక్రవారం రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని వార్తలు