రైలు కిందపడి ముగ్గురి ఆత్మహత్య

29 May, 2018 13:35 IST|Sakshi
దంపతుల మృతదేహాలు, వెంకట​య్య ఆధార్‌ కార్డు

మధిర: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. సోమవారం రాత్రి మధిర రైల్వేస్టేషన్‌ సమీపంలో ఇది జరిగింది. గుంటూరు నెహ్రూనగర్‌కు చెందిన బుంగా వెంకయ్య(47), గుంటూరు మిర్చి యార్డులో పనిచేస్తున్నాడు. ఈయనకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. కొద్ది రోజులుగా కుమార్తె వివాహం విషయంలో వీరి ఇంటిలో వివాదం జరుగుతున్నట్టు తెలిసింది.

ఈ నేపథ్యంలోనే, వెంకయ్య, ఆయన భార్య రజిని(40), కుమార్తె సాయి కృష్ణవేణి(19) కలిసి గుంటూరు నుంచి రైలులో సోమవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో  మధిరకు చేరుకున్నారు. మధిర రైల్వే స్టేషన్‌ సమీపంలోని విజయవాడ వైపు వెళ్లే డౌన్‌లైన్‌ గూడ్స్‌ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. వెంకయ్య దంపతుల కుమారుడు సాయి గోపినాథ్, గుంటూరులో ఇంటర్‌ సెకండియర్‌ చదువుతున్నాడు.

వెంకయ్య జేబులోని ఆధార్‌ కార్డు ఆధారంగా వారిని రైల్వే పోలీసులు గుర్తించారు. వారి బంధువులకు రైల్వే హెడ్‌ కానిస్టేబుల్‌ తుమ్మల బాలస్వామి సమాచారమిచ్చారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి బలవన్మరణం.. ఈ ప్రాంతంలో కలకలం సృష్టించింది.  

మరిన్ని వార్తలు