ఘోరం

18 Jul, 2019 07:07 IST|Sakshi
కారులోనే మృతి చెందిన డ్రైవర్‌ కర్ణాటక

టైర్‌ పేలి లారీని ఢీకొన్న ఇన్నోవాకారు  

డ్రైవర్, ముగ్గురు మహిళల మృతి  

మరో ఐదుగురికి తీవ్ర గాయాలు  

చిత్రదుర్గం వద్ద దుర్ఘటన  

బాధితులు బెంగళూరువాసులు

సాక్షి, బళ్లారి: సరదాగా సాగుతున్న ప్రయాణంపై ఒక్కసారిగా మృత్యువు పంజా విసిరింది. ఏం జరిగిందో తెలుసుకునే లోగానే ఐదుగురి ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. ఇన్నోవా కారు, లారీ ఢీకొనడంతో డ్రైవర్, ముగ్గురు మహిళలు దుర్మరణం చెందిన సంఘటన బుధవారం జరిగింది. చిత్రదుర్గం సమీపంలోని జాతీ య రహదారిలో మహాలింగప్ప పెట్రోల్‌ బంక్‌ సమీపంలో ఘోరం జరిగింది. వివరాలు.. బెంగళూరులోని ఆర్‌ఆర్‌ నగరలో నివాసం ఉంటున్న ఒక కుటుంబం ఇన్నోవాలో చిత్రదుర్గానికి పని మీద వచ్చింది. చిత్రదుర్గం నుంచి బాదామిలో పర్యాటక ప్రదేశాల వీక్షణకని బయల్దేరారు. కొంతసేపటికే మృత్యువు వెంటాడింది. 

ఘటన స్థలంలో చెల్లాచెదురుగా పడిన మృతదేహాలు  
నుజ్జయిన కారు  
కారు వేగంగా వెళ్తుండగా టైర్‌ పేలడంతో అదుపు తప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. దీంతో కారు నుజ్జునుజ్జుకాగా, కారు డ్రైవర్‌తో పాటు అందులోని ముగ్గురు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారులోని ఐదుమందికి తీవ్ర గాయాలయ్యాయి.  మృతులను డ్రైవర్‌ అశోక్‌ (35), శ్యామల (64), శోభ (45), సుకన్య (67)గా గుర్తించారు. పవిత్ర (30), మంజుల (45), శ్రేష్ట (7), అథార్థ్‌ (2), మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులందరూ ఒకే కుటుంబానికి చెందిన వారుగా పోలీసులు భావిస్తున్నారు. గాయపడిన వారిని చికిత్స కోసం చిత్రదుర్గ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై చిత్రదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకొన్నారు.

మరిన్ని వార్తలు