విషాదం: బావిలోకి దిగి ముగ్గురు యువకుల మృతి

10 Jul, 2019 15:51 IST|Sakshi

సాక్షి, ఆసిఫాబాద్‌: కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కౌటాల మండలం ముత్యంపేట్‌ గ్రామంలో ముగ్గురు యువకులు బావిలోకి దిగి ప్రమాదవశాత్తు మృతిచెందారు. ఒకరిని కాపాడటానికి మరోకరు బావిలోకి దిగి ముగ్గురు యువకులూ మరణించారు. మొదట రాజేష్‌ (26) అనే వ్యక్తి బావిలోకి దిగాడు, అతను ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో శ్రీనివాస్‌ (25) లోపలికి దిగాడు. వారిద్దరూ బయటకు రాకపోవడంతో వారిని కాపాడేందుకు మహేష్‌ (18) బావిలోపలికి దిగాడు. చివరికి ముగ్గురూ మృతి చెంది వారి కుటుంబంలో విషాదాన్ని మిగిల్చారు.

అయితే వారి మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బావిలో విషవాయువులు ఏమైనా ఉన్నాయా?, లేక ఊపిరాడక చనిపోయారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముందస్తు జాగ్రత్తగా మృతదేహాలను బయటకు తీయడానికి ఎవరినీ బావిలోనికి దిగనీయడం లేదు. జేసీబీ యంత్రాలతో వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు. అప్పటి వరకు సరదగా ఉన్న ముగ్గురు యువకులు మృతిచెందడంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది. వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. 

మరిన్ని వార్తలు