మోటార్‌ సైక్లిస్ట్‌పై పిడుగు

7 Jun, 2018 10:12 IST|Sakshi
పిడుగుపాటుతో తీవ్ర అస్వస్థతకు గురైన మహేష్‌ 

అక్కడికక్కడే మృతి

మరొకరి పరిస్థితి విషమం

సాక్షి, హుకుంపేట : మండలంలోని మారుమూల మత్స్యపురం పంచాయతీ తురకలమెట్ట సమీపంలో బుధవారం సాయంత్రం బైక్‌పై ఒక్కసారిగా పిడుగుపడడంతో మోటార్‌సైక్లిస్ట్‌ మృతి చెందాడు. సమీపంలో ఉన్న మరో గిరిజనుడికి గాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉంది. ఉప్ప బైరోడివలస గ్రామానికి చెందిన కొర్రా సుబ్బారావు (40) పాడేరులో పనులు పూర్తి చేసుకుని, తురకలమెట్ట గ్రామానికి చెందిన ఉబ్బేటి మహేష్‌(30)తో కలిసి బైక్‌పై స్వగ్రామానికి వస్తున్నాడు. సాయంత్రం ఐదు గంటల సమయంలో పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసింది. తురకలమెట్ట జంక్షన్‌లో తన బైక్‌ వెనుక కూర్చున్న మహేష్‌ను దింపి, వెళుతున్న సమయంలో బైక్‌పై పిడుగుపడింది. ఈ పిడుగు ధాటికి బైక్‌ నడుపుతున్న సుబ్బారావు కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందాడు. సమీపంలో ఉన్న మహేష్‌ కూడా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. సమీపంలోని గిరిజనులు మహేష్‌ను ఉప్ప ఆరోగ్య కేంద్రానికి తరలించి ప్రాథమిక వైద్యసేవలు కల్పిం చారు. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో రాత్రి పాడేరు ప్రాంతీయ ఆస్పత్రికి అంబులెన్స్‌లో తరలించారు. మృతుడు సుబ్బారావు వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలుతో జీవనోపాధి పొందుతున్నాడు. మృతునికి భార్య, పిల్లలు ఉన్నారు. సమాచారం తెలుసుకున్న వీఆర్వో జ్యోతి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు.

 
పిడుగు పడి ఆవు మృతి
పద్మనాభం(భీమిలి) : బి.తాళ్లవలసలో బుధవారం సాయంత్రం పిడుగు పడి ఒక చూడి ఆవు మృతి చెందింది. గెద్ద నాగరాజుకు చెందిన ఆవు కళ్లంలో చెట్టు కింద ఉంది. పిడుగు పడడంతో ఆవు అక్కడికక్కడే దుర్మరణం చెందింది. దీని విలువ రూ. 35వేలు. మరో నెల రోజుల్లో ఈ ఆవు ప్రసవించనుంది. ఇంతలో పిడుగు మృత్యువు రూపంలో ఆవును కబళించకపోవడంతో నాగరాజు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. 

మరిన్ని వార్తలు