బురారీ మిస్టరీ : పెట్‌ డాగ్‌ డెడ్‌

23 Jul, 2018 11:34 IST|Sakshi
బురారీ కేసులో కీలకమైన పెట్‌ డాగ్‌

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బురారీ ఆత్మహత్యల కేసులో, మరో గుండె బద్దలయ్యే సంఘటన చోటు చేసుకుంది. ఈ కేసులో కీలకంగా మారి.. ఆ కుటుంబంలో ప్రాణాలతో మిగిలి ఉన్న ఏకైక ప్రాణి,  పెట్‌ డాగ్‌ ‘టామీ’  హార్ట్‌ అటాక్‌తో మరణించింది. నోయిడా జంతు సంరక్షణ కేంద్రంలో ఉంటున్న ఈ పెట్‌ డాగ్‌ మరణించినట్టు హిందూస్తాన్‌ టైమ్స్‌ రిపోర్టు చేసింది. బురారీ కుటుంబం హత్యకు గురైనప్పుడు, ఈ పెట్‌ డాగ్‌ తీవ్ర జ్వరంతో టెర్రస్‌పై వణుకుతూ కనిపించింది. కుటుంబ సభ్యులంతా ఆత్మహత్యకు యత్నించే సమయంలో ఆ పెట్‌ డాగ్‌ను గ్రిల్‌కు కట్టేసి ఉంచారు. మీడియా ద్వారా ఈ పెట్‌ డాగ్‌ గురించి తెలుసుకు సంజయ్‌ మొహపాత్ర అనే జంతు హక్కుల పోరాట కార్యకర్త దానిని పోలీసుల అనుమతితో తన జంతు సంరక్షణ కేంద్రానికి తీసుకెళ్లారు. అయితే తొలుత ఆ డాగ్‌ చాలా కోపంగా ఉండేదని, ఎవరిని దగ్గరికి రాణించేదని కాదని అతను మీడియాకు తెలిపారు. ఈ కేసును అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు పెట్‌ డాగ్‌ సైగల నుంచి కూడా మరింత సమాచారన్ని రాబట్టే ప్రయత్నం చేశారు.

‘ఈ డాగ్‌కు అంతకముందు నుంచే పలు అనారోగ్య సమస్యలు ఉండి ఉంటాయి. వారికి తెలిసి ఉండకపోవచ్చు. బురారీ ట్రాజెడీ అనంతరం ఈ డాగ్‌ను కొత్త వాతావరణంలోకి తీసుకురావాల్సి వచ్చింది. అయితే ఇన్ని రోజులు వారి ప్రేమ, ఆప్యాయల  మధ్య జీవించిన ఈ పెట్‌ డాగ్‌, కొత్త వాతావరణానికి అలవాటు కాలేకపోయింది. దీంతో దీని ఆరోగ్యం మరింత క్షీణించింది’ అని జంతు సంరక్షణ అధికారి చెప్పారు. కాగ, ఇటీవల ఢిల్లీలోని బురారీలో పదకొండు మంది ఆత్మహత్యలకు పాల్పడ్డ ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఒకే ఇంట్లో 10 మంది ఇంట్లోని సీలింగ్‌కు ఉన్న ఇనుప కమ్మీలకు ఉరివేసుకోగా.. భాటియా ఇంటి పెద్ద నారాయణ్‌ దేవీ గొంతు తెగి రక్తపు మడుగులో కనిపించింది. ఈ కేసుపై విచారణ చేపడుతున్న పోలీసులు, వారి ఇంట్లో కొన్ని రాత పూర్వక నోట్లను కూడా గుర్తించారు.  ఈ పత్రాలను బట్టి కుటుంబం మొత్తం తాంత్రిక పూజల్లో పాల్గొనేదని, అందులో రాసిపెట్టినట్లుగానే వాళ్లు ఉరి వేసుకుని చనిపోయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. 

మరిన్ని వార్తలు