పరిశ్రమలో విషవాయువు వెలువడి..

20 Mar, 2018 12:16 IST|Sakshi
సాయికిరణ్‌ మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబసభ్యులు

 యువకుడి దుర్మరణం

వెలిమినేడు శివారులోని పరిశ్రమలో ఘటన

చిట్యాల (నకిరేకల్‌) : పరిశ్రమలో విషవాయువు వెలువడి ఓ యువకుడు మృతిచెందాడు. ఈ సంఘటన చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ శివారులోని అతులిత రసాయన పరిశ్రమలో సోమవారం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. మండలంలోని ఏపూరు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌ ఉప్పల అంజయ్య కుమారుడు సాయికిరణ్‌(20) రెండు నెలలుగా మండలంలోని అతులిత రసాయన పరిశ్రమలో హెల్పర్‌గా పనిచేస్తున్నాడు.

సోమవారం పరిశ్రమలోని ఓ యూనిట్‌లో అకస్మాత్తుగా విషవాయువులు వెలువడ్డాయి. ఆ సమయంలో అక్కడే పనిచేస్తున్న సాయికిరణ్‌ ఆపస్మారక స్థితికి చేరుకున్నాడు. దీంతో సాయికిరణ్‌ను పరిశ్రమ నిర్వహణ అధికారులు ఆ గ్రామ శివారులోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ సాయికిరణ్‌ను పరీక్షించిన వైద్యులు మృతిచెందినట్లు నిర్ధారించారు. 

పరిశ్రమ ఎదుట ఆందోళన..
సాయికిరణ్‌ మృతి విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, స్నేహితులు పరిశ్రమ వద్దకు భారీగా చేరుకున్నారు. సా యికిరణ్‌ మృతదేహాన్ని పరిశ్రమ ఆవరణలో ఉంచి ఆందోళనకు దిగారు. పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే సాయికిరణ్‌ మృతి చెందాడని ఆరోపించారు. యజమాన్యం సాయికిరణ్‌ కుటుంబానికి పరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. పరిశ్రమ యజమాన్యం కొంత పరిహారం చెల్లించేందుకు అంగీకరించటంతో ఆందో ళన విరమించారు. కాగా చేతికందిన కొడుకు మృతి చెందటంతో తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. 

మరిన్ని వార్తలు