సారవకోట: మండలంలోని నౌతళ ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. నౌతళ నుంచి తెంబూరు వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ దారుణ సంఘటనలో ఇద్దరు దుర్మరణం చెందారు. విశాఖపట్నం జిల్లా మారికవలసకు చెందిన కె.రాజు(28), కొమ్మాది జంక్షన్కు చెందిన గంటా ఎల్లాజి(37) ట్రాక్టర్ కింద పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాలు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలావున్నాయి. జియో నెట్వర్క్ టవర్ నిర్మాణ పనులకు సంబంధించి 9 మంది కార్మికులు నౌతళ నుంచి బొంతు మీదుగా పాతపట్నం మండలం తెంబూరు గ్రామానికి ట్రాక్టర్పై గజాలను గురువారం తరలిస్తున్నారు. నౌతళ ఘాట్ రోడ్డులో నౌతళ సమీపంలో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది.
ఈ ఘటనలో కె.రాజు, గంటా ఎల్లాజి అక్కడికక్కడే మృతి చెందారు. హిరమండలం మండలం ధనుపురం గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ లక్ష్మణరావుతో పాటు విశాఖపట్నం జిల్లా కొమ్మాది, కంచరపాలెం, మధురవాడకు చెందిన ధార వీర్రాజు, వెంకట్రావు, ధయానంద్లు తీవ్రగాయాలపాలైయ్యారు. గాయపడిన నలుగురిని పాతపట్నంకు చెందిన 108 వాహనంలో శ్రీకాకుళం రిమ్స్కు తరలించగా ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. మిగిలిన కార్మికులలో శిమ్మ రాము, మరో ముగ్గురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
తమతో పాటు పనిచేసిన కార్మికులు కళ్లముందే ప్రమాదంలో మరణించడంతో వీరు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. పాతపట్నం సీఐ పి.పైడయ్య, పాతపట్నం ఎస్ఐ చిన్నంనాయుడు, సారవకోట ఏఎస్ఐ ఎంఆర్కే రెడ్డి సంఘటనా స్థలంలో శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను పాతపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీనిపై స్థానిక ఏఎస్ఐ ఎంఆర్కే రెడ్డి కేసు నమోదు చేశారు. సంఘటనా స్థలాన్ని పాలకొండ డీఎస్పీ ప్రేమ కాజల్ పరిశీలించి ప్రమాదానికి గల కారణాలను సీఐని అడిగి తెలుసుకున్నారు.
అధిక లోడుతో అదుపు తప్పిన ట్రాక్టర్
తెంబూరు సమీపంలో నిర్మించనున్న జియో టవర్ పనుల నిమిత్తం నౌతళ నుంచి ట్రాక్టర్పై ఇనుప గజాలను తరలిస్తున్నారు. అయితే ట్రాక్టర్ పరిమాణం కంటే అధికంగా గజాలను ఎక్కించడం, ఘాట్ రోడ్డు కావడంతో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడినట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. గజాలుపై కొంతమంది కార్మికులు కూర్చోగా మరికొంత మంది డ్రైవర్తో పాటు ఇంజిన్ వద్ద కూర్చోన్నారు. అధిక లోడు ఎక్కిస్తున్నారని డ్రైవర్తో పాటు ఇతర కార్మికులు చెబుతున్నా మేస్త్రీ లెక్కచేయలేదని, ఒకేసారి గజాలు తరలించాలని సూచించడంతో ప్రమాదం జరిగిందని తోటి కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.