ట్రాక్టర్‌ చక్రాల కింద నలిగిపోయిన బాలుడు

17 Mar, 2020 14:40 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని జిల్లెల్లగూడ వివేకానంద చౌరస్తాలో ఓ ట్రాక్టర్‌ సైకిల్‌ను ఢీకొట్టింది. మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో జగదీష్‌ (12) అనే బాలుడు మృతిచెందగా.. అతడి స్నేహితుడు ప్రాణాలతో బయటపడ్డాడు. వివరాలు.. సూర్యాపేట జిల్లాకు చెందిన నగేశ్‌, మంగమ్మ దంపతులు గత కొంతకాలంగా మీర్‌పేటలోని దాసరి నారాయణ కాలనీలో నివాసముంటున్నారు. ఈక్రమంలో వారి రెండో కుమారుడు జగదీశ్‌ స్నేహితుడితో కలిసి సైకిల్‌పై వెళ్తున్నాడు.

వివేకానంద చౌరస్తావద్దకు రాగానే.. ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ వారి సైకిల్‌ను ఢీకొట్టింది. జగదీశ్‌ ట్రాక్టర్‌ చక్రాల కింద పడిపోగా.. అతని స్నేహితుడు ఎగిరి పక్కకు పడ్డాడు. తీవ్రగాయాలతో జగదీశ్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. జగదీశ్‌ బాలాపూర్‌లోని శ్రీగాయత్రి పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. ఇక ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్‌ డ్రైవర్‌ కూడా మైనరే కావడం గమనార్హం. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీలో నమోదయ్యాయి.

మరిన్ని వార్తలు