ట్రాఫిక్‌ పోలీసులనే టార్గెట్‌ చేశారు

29 Aug, 2019 11:45 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్, పోలీసుల అదుపులో నిందితులు

లంగర్‌హౌస్‌: చదువుతోంది డిగ్రీ...డ్రంక్‌ ఆండ్‌ డ్రైవ్‌లో పట్టుబడితే తన వాహనాన్ని సీజ్‌ చేశారని ట్రాఫిక్‌ పోలీసులపై కక్ష పెంచుకున్నారు. కక్ష సాధింపు చర్యగా ఏకంగా ట్రాఫిక్‌ పోలీసుల నుంచే మూడు ద్విచక్ర వాహనాలు చోరీ చేశారు.  చివరకు సిగ్నల్‌ జంప్‌ ఈ–చలాన్‌ నేరస్తులను పట్టించి కటకటాలపాటు చేసింది.   లంగర్‌హౌస్‌ ఇన్‌స్పెక్టర్‌  శ్రీనివాస్, డీఐ యాదయ్య గౌడ్, డీఎస్సై నరేందర్‌ వివరాలు వెల్లడించారు. ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ తెలిపిన మేరకు.. లంగర్‌హౌస్‌ సర్దార్‌బాగ్‌లో నివాసముండే మొహమ్మద్‌ జహంగీర్‌(20) కారు మెకానిక్‌గా పనిచేస్తు చదువుకుంటున్నాడు.

మారుతీనగర్‌లో నివాసముండే ధనరాం భాస్కర్‌(19) సనత్‌నగర్‌లోని శ్లోకం కళాశాలలో డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్నాడు. వీరిద్దరూ గత ఫిబ్రవరి నెలలో మద్యంతాగి యాక్టివా వాహనంపై వస్తుండగా లంగర్‌హౌస్‌ బాపూఘాట్‌ వద్ద టోలీచౌకీ ట్రాఫిక్‌ పోలీసులు అడ్డుకున్నారు. జహంగీర్‌పై కేసు నమోదు చేసి అతని వాహనాన్ని స్వాధీనం చేసుకొని సంగం ఆలయం పక్కన ట్రాఫిక్‌ సీజ్‌ వాహనాల పార్కింగ్‌లో పెట్టారు. దీంతో పోలీసులపై కక్ష పెంచుకున్న జహంగీర్‌ జరిగిన విషయాన్ని భాస్కర్‌కు తెలిపాడు. ఎలాగయినా తన వాహనాన్ని తెచ్చుకోవాలని నిర్ణయించుకున్నారు.

రెండు రోజుల తరువాత సంగం ప్రాంతాన్ని పరిశీలించిన జహంగీర్, భాస్కర్‌లు 24 గంటలు ట్రాఫిక్‌ పోలీసులు కాపలా ఉండటమే కాకుండా వాహనాలకు అడ్డుగా బారీకేడ్లు పటిష్టంగా ఏర్పాటు చేయడం గమనించారు. పక్కా ప్లాన్‌తో  తెల్లవారుఝామున వాహనాల పార్కింగ్‌లోకి చొరబడ్డారు. పోలీసుల కళ్లు కప్పి తమ ద్విచక్రవాహనాన్ని వాగులోంచి దాటించి మూసీకి అటు వైపు చెట్ల నుండి తీసుకెళ్లారు. మరో రెండు రోజుల తరువాత సంగం వచ్చి పల్సర్‌ వాహనాన్ని చోరీ చేసి   మూసీలోంచి అవతలి గట్టుకు తీసుకెళ్లి ఉడాయించారు. 

అయితే పల్సర్‌ వాహనదారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయగా నిందితున్ని అరెస్టు చేసిన తరువాత అక్కడ చోరీ అయ్యింది ఒకటి కాదు రెండు వాహనాలు అని తెలియడంతో పోలీసులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు.కాగా ఈ చోరీకి భాద్యత వహిస్తు విదులు నిర్వహిస్తున్న హోంగార్డులు తమ వేతనాల నుండి భాదితునికి ద్విచక్ర వాహనాన్ని కొనిచ్చారు. తరువాత మరో బాలున్ని చేర్చుకొని మియాపూర్‌ ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ పార్కింగ్‌ నుండి మరో వాహనాన్ని చోరీ చేసి వాటిని అమ్మి హుక్కా సేవిస్తూ విలాస జీవితాన్ని గడుపుతున్నారు. లంగర్‌హౌస్‌తో పాటు నార్సింగి పరిధిలో రెండు కెటీఎం వాహనాలు, రెండు రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ వాహనాలను చోరీ చేశారు.

ఈ చలాన్‌ పట్టించింది...
కొద్ది రోజుల క్రితం చోరీ చేసిన వాహనంపై ఇద్దరూ తిరుగుతు మాసబ్‌ట్యాంక్‌ వద్ద సిగ్నల్‌ జంప్‌ చేశారు. ఈ చలాన్‌ ఆ«ధారంగా పరిసర ప్రాంతాల సీసీ ఫుటేజీలు పరిశీలించగా నిందితులు మల్లేపల్లి వరకు వెళ్లినట్లు గుర్తించారు. దీంతో  ట్రాఫిక్‌ కానిస్టేబుళ్లు తివారి, నరేష్‌ బాబు, మదన్‌లు కొద్ది రోజులు ఆయా ప్రాంతాలలో డేగకన్నుతో తిరుగుతు చాకచక్యంగా నిందితులు భాస్కర్, జహంగీర్‌లను అదుపులోకి తీసుకున్నారు.వీరిని అరెస్టు చేసి 5 వాహనాలను సీజ్‌ చేశారు.

మరిన్ని వార్తలు