విహారయాత్రలో అపశ్రుతి

20 Nov, 2019 13:37 IST|Sakshi

నవ వరుడు మృతి 

మనాలి హనీమూన్‌లో విషాదం

టీ.నగర్‌ : విహారయాత్రకు హిమాచ్‌ప్రదేశ్‌లోని మనాలికి వెళ్లిన చెన్నై నవవరుడు మృతి చెందాడు. సోమవారం భార్య కళ్లెదుటే జరిగిన ఈ విషాద సంఘటన శోకాన్ని నింపింది. చెన్నై అమింజికరై తిరువీధి అమ్మన్‌ ఆలయం వీధికి చెందిన అరవింద్‌ (27). ప్రీతిలకు గత వారం వివాహం జరిగింది. అనంతరం కొత్త జంట హనీమూన్‌ కోసం హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలికి వెళ్లారు. డోబీ అనే ప్రాంతంలో ప్యారాగ్లైడింగ్‌లో పర్యాటకులు విహరించడం విశేషం. దీనిని గమనించిన అరవింద్‌కు కుతూహలం ఏర్పడింది. ఇందుకోసం టికెట్‌ కొనుగోలు చేసి సోమవారం ప్యారాగ్లైడర్‌ పైలట్‌ హరూరామ్‌తో అరవింద్‌ విహరించాడు. 

దీనిని ఆసక్తితో ప్రీతి గమనిస్తూ వచ్చింది. ఆకాశంలో విహరిస్తుండగానే కొద్ది సేపట్లో ప్యారాగ్లైడర్‌లో అరవింద్‌ నడుముకు కట్టుకున్న బెల్ట్‌ వీడిపోయినట్లు తెలిసింది. దీంతో అరవింద్‌ ప్యారాగ్లైడర్‌ నుంచి కింద నున్న పల్లంలో పడిపోయాడు. తీవ్ర గాయాలతో సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ఆ సమయంలో అత్యవసరంగా కిందకు దిగుతూ పైలట్‌ హరూరామ్‌ గాయపడ్డాడు. అతన్ని అదే ప్రాంతంతోని ఆసుపత్రిలో చేర్పించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వచ్చి విచారణ జరిపారు. అరవింద్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కులు హాస్పిటల్‌కు తరలించారు. భర్త మృతదేహాన్ని చూసి ప్రీతి రోదించడం అక్కడి వారిని కలచి వేసింది. పోలీసుల ప్రాథమిక విచారణలో భద్రతా బెల్ట్‌ను సరిగా కట్టుకోకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. 

మరిన్ని వార్తలు