తోడబుట్టిన అన్నే తల నరికాడు!

24 Nov, 2019 14:11 IST|Sakshi
తలలేని మొండేన్ని పరిశీలిస్తున్న సీఐ దేవేంద్రకుమార్‌

కసితో పొలాల్లోకి విసిరేసిన వైనం 

పొలాన్ని ఇతరులకు కౌలుకు ఇచ్చాడనే అక్కసుతో దారుణ హత్య 

సాక్షి, పుట్లూరు : పొలాన్ని ఇతరులకు కౌలుకు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేని ఓ అన్న సొంత తమ్ముడి తలను తెగనరికి పొలాల్లోకి విసిరేసిన ఘటన అనంతపురం జిల్లా పుట్లూరు మండలంలో శనివారం ఉదయం చోటు చేసుకుంది. శనగలగూడూరు గ్రామానికి చెందిన రాజ్‌కుమార్‌ తన పొలాన్ని అన్న రామాంజినేయులుకు 10 సంవత్సరాలుగా కౌలుకు ఇస్తున్నాడు. అయితే అతను పంట పండించుకుంటున్నా కౌలు డబ్బు ఇవ్వకపోవడంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. ఈ ఏడాది రాజ్‌కుమార్‌ తన భూమిని అన్నకు కాకుండా గ్రామానికి చెందిన ఇతరులకు కౌలుకు ఇవ్వడంతో రామాంజినేయులు జీర్ణించుకోలేకపోయాడు. 

రాజ్‌కుమార్‌ భూమిని కౌలుకు తీసుకున్న వ్యక్తులు ఆ పొలంలో పప్పుశనగను సాగు చేశారు. అయితే వర్షాభావం వల్ల పప్పుశనగకు పొలం పక్కనే ఉన్న నీటికుంట ద్వారా తడులు అందించడానికి కౌలుదారులు ప్రయత్నించగా రామాంజినేయులు అడ్డుకున్నాడు. ఇదే విషయాన్ని కౌలుదారులు చెప్పడంతో శనివారం పొలం వద్దకు వెళ్లిన రాజ్‌కుమార్‌తో పాటు కౌలుదారులైన వెంకటరెడ్డి, శ్రీనివాసులరెడ్డి కళ్లలో కారం కొట్టిన రామాంజినేయులు అతని కుమారుడు మధుతో కలిసి అత్యంత దారుణంగా రాజ్‌కుమార్‌ తలను వేరు చేసి పొలాల్లోకి విసిరేశాడు. హత్య జరిగిన ప్రదేశాన్ని  తాడిపత్రి రూరల్‌ సీఐ దేవేంద్రకుమార్, ఎస్‌ఐ వెంకటప్రసాద్‌ పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు. 

సొమ్మసిల్లిన భార్య..
రాజ్‌కుమార్‌ హత్య విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. తల లేని భర్త మొండేన్ని చూసి  భార్య లక్ష్మిదేవి సొమ్మసిల్లి పడిపోయింది. మృతుడి ఇద్దరు కుమార్తెలు తిరుపతిలో చదువుకుంటున్నారు.

మరిన్ని వార్తలు