ట్రైయాంగిల్‌ లవ్‌స్టోరీ; పక్కా ప్లాన్‌తో..

4 Jul, 2019 13:09 IST|Sakshi

న్యూఢిల్లీ : ఒకే అమ్మాయిని ఇష్టపడిన ఇద్దరు యువకుల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగడంతో.. ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ప్రియురాలిని ఎరగా వేసిన నిందితుడు పక్కా ప్లాన్‌తో మూడో వ్యక్తిని హతమార్చాడు. ఈ ఘటన వజీపూర్‌లో వెలుగుచూసింది. వివరాలు.. చదువు మధ్యలోనే మానేసిన అజయ్‌ (19) వజీపూర్‌లోని మేనమామ వద్ద ఉంటున్నాడు. అదే గ్రామానికి చెందిన ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ అమ్మాయిని ఇష్టపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న ఆ అమ్మాయి బాయ్‌ఫ్రెండ్‌ ఆర్చిత్‌ చౌహాన్‌ (22) అజయ్‌పై పగ పెంచుకున్నాడు. ఎలాగైనా తనని అంతమొందించాలని పథకం పన్నాడు.

యువతితో చెప్పి స్థానిక స్కూల్‌ వద్దకు అజయ్‌ని రప్పించాడు. పాఠశాల వద్దకు వచ్చిన అజయ్‌ ఆర్చిత్‌ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో ముందుగా అనుకున్న ప్లాన్‌ ప్రకారం ఆర్చిత్‌ అజయ్‌ని తుపాకీతో అతిదారుణంగా కాల్చి చంపాడు. అనంతరం పరార్‌ అయ్యారు. ఈ హత్య గురించి తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణమని ఏసీపీ రాజీవ్‌కుమార్‌ అనుమానం వ్యక్తం చేశారు. పాయింట్‌ బ్లాంక్‌లో కాల్చడంతో అజయ్‌ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడని చెప్పారు. అమ్మాయిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని, పరారీలో ఉన్న నిందితున్ని పట్టుకుంటామని తెలిపారు. పోస్టుమార్టం రిపోర్టులు వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు తెలియనున్నాయి.

మరిన్ని వార్తలు