భర్త కళ్లెదుటే..

16 Nov, 2019 12:26 IST|Sakshi
పలాసి కొండమ్మ (ఫైల్‌) మృతురాలి బంధువులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి

వరికోతకు వెళ్లి కుప్పకూలిన గిరి మహిళ

ఆస్పత్రికి తరలించిన కొద్దిసేపటికే మృతి

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి

పాడేరు: భర్తతో కలిసి వరి కోతకు వెళ్లిన గిరిజన మహిళ ఆకస్మికంగా కుప్పకూలి ఆస్పత్రికి తరలించిన కొద్ది సేపటికే మృతి చెందింది. ఈ విషాద సంఘటన గొండెలి పంచాయతీ లింగాపుట్టు గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇదే  గ్రామానికి చెందిన పలాసి కొండమ్మ (40) తన భర్త పలాసి నూకరాజుతో కలిసి శుక్రవారం ఉదయం తమ పంట పొలంలో వరి కోతకు వెళ్లింది. వరి చేనును కోస్తున్న సమయంలో ఆకస్మికంగా ఆమె కుప్పకూలి పడిì పోయింది. నోటి నుంచి నురగ వస్తుండడంతో పాము కాటేసిందని భావించిన భర్త నూకరాజు తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. గ్రామస్తుల సాయంతో అంబులెన్సులో పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్య చికిత్సలు అందిస్తుండగా ఆమె మృతి చెందింది. కళ్లెదుటే భార్య చనిపోవడంతో భర్త నూకరాజు తీవ్రంగా రోదించాడు. ఈ విషయం తెలుసుకున్న పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి

భాగ్యలక్ష్మి ఆస్పత్రికి చేరుకుని వైద్యులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. కొండమ్మకు ప్రభుత్వం తరఫున రావాల్సిన రాయితీలు ఏమైనా ఉంటే త్వరితగతిన అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించిన వారిలో వైఎస్సార్‌సీపీ మండల పార్టీ అధ్యక్షులు కూడా సింహాచలం, కిముడు సింహాచలం, కిముడు విశ్వ, రామకృష్ణ, తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు