వేశ్యా గృహం పేరుతో.. పోలీసుల ట్రాప్‌..

24 Nov, 2017 09:16 IST|Sakshi
ఫైల్‌ ఫొటో

న్యూఢిల్లీ : మైనర్‌ బాలికను వేశ్యా గృహానికి అమ్మబోయి.. పోలీసులకు ఫోన్‌ చేసిన ఇద్దరు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇద్దరు వ్యక్తులు బిహార్‌కు చెందిన వారిగా వెల్లడించారు. వేశ్య గృహం నిర్వహిస్తున్నట్లు నటించి వారిని ట్రాప్‌ చేసి పట్టుకున్నట్లు తెలిపారు. వేశ్య గృహం పేరుతో ఓ మొబైల్‌ నంబర్‌ను తామే ఇంటర్నెట్‌లో పెట్టినట్లు వివరించారు. అది వేశ్య గృహానికి చెందినదిగా భావించిన అమర్‌(24), రంజీత్‌ షా(27)లు మైనర్‌ బాలిక అమ్మకానికి ఉన్నట్లు ఫోన్‌ చేసి చెప్పారు.

ఆ కాల్‌ను రిసీవ్‌ చేసుకున్న స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ వారితో చాకచక్యంగా మాట్లాడి ట్రాప్‌ చేసినట్లు తెలిపారు. బాలికను రూ.3.5 లక్షలకు అమ్ముతామని ఇద్దరు ఫోన్‌లో చెప్పగా.. రూ. 2.3 లక్షలకు డీల్‌ కుదుర్చుకున్నట్లు తెలిపారు. తొలుత న్యూఢిల్లీ రైల్వేస్టేషన్‌ వద్ద డబ్బును ఇవ్వాలని అనంతరం గుడ్‌గావ్‌లోని ఇఫ్‌కో చౌక్‌లో బాలికను అందజేస్తామని పోలీసులతో ఇద్దరు వ్యక్తులు ఒప్పందం చేసుకున్నట్లు వివరించారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌ వద్ద డబ్బు కోసం వేచి ఉన్న ఇద్దరిని పట్టుకున్నట్లు చెప్పారు.

తాము ఏర్పాటు చేసిన మొబైల్‌ నంబర్‌కు పెద్ద ఎత్తున అమ్మాయిలను అమ్ముతామని ఫోన్లు వస్తున్నట్లు వివరించారు. గుడ్‌గావ్‌ పోలీసుల సాయంతో బాలికను రక్షించినట్లు వెల్లడించారు. ట్రాఫికింగ్‌కు గురైన మైనర్‌ బాలిక ఇంట్లో వదిలి ఢిల్లీకి వచ్చినట్లు తెలిసింది. బిహార్‌లో బాలికను ప్రేమించానని నమ్మించిన అమర్‌.. ఢిల్లీకి వస్తే జాబ్‌ ఇప్పిస్తానని నమ్మబలికినట్లు పోలీసులు చెప్పారు. అక్టోబర్‌లో ఢిల్లీకి వచ్చిన ఆమెపై అమర్‌, రంజీత్‌ షాలు పలుమార్లు అత్యాచారం చేసినట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు