వినయంగా ఉంటోందని.. బాలిక దారుణ హత్య

24 Jan, 2019 21:03 IST|Sakshi

లక్నో : గురువు పట్ల చూపిన వినయ, విధేయతలే ఓ చిన్నారి ప్రాణాలను బలితీసుకున్నాయి. ఆరేళ్ల బాలికపై కన్నేసిన ఓ ట్యూటర్‌ చిన్నారిని దారుణంగా హత్యచేశాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..  ఘజియాబాద్‌కు చెందిన ఫైజల్‌ ఇస్లామ్‌ అనే వ్యక్తి చదువుకుంటూనే చిన్నపిల్లలకు ట్యూషన్‌ చెబుతున్నాడు. అతడి వద్దకు ట్యూషన్‌కు వచ్చే వారిలో చిన్నదైన, మిక్కిలి వినయ, విధేయతలు కలిగిన ఆరేళ్ల బాలికపై అతడు కన్నేశాడు. ఈ నెల 21వ తేదీన పిల్లలందర్ని ఇంటికి పంపేసిన తర్వాత బాలికను అతడి మామ ఇంటికి తీసుకెళ్లాడు. ఇస్లామ్‌ మామ కుటుంబసభ్యులతో కలిసి పనిమీద రాజస్తాన్‌ వెళ్లటం అతడికి కలిసొచ్చింది. ఆ తర్వాత బాలికపై లైంగిక దాడికి దిగటంతో చిన్నారి ప్రతిఘటించింది.

దీంతో అతడు బాలికను హత్య చేశాడు. బాలిక మృతదేహన్ని పరుపులో చుట్టి మసీదు బయట పడవేసి అక్కడినుంచి పరారయ్యాడు. చిన్నారి కుటుంబసభ్యులు ఎంతసేపటికి బాలిక ఇంటికి రాకపోవటంతో వెతకటం ప్రారంభించారు. ఇస్లామ్‌ మీద అనుమానంతో అతడి ఇంటికి వెళ్లి వెతికినా లాభం లేకపోయింది. ఇంటి పక్కవారు బాలిక ఇస్లామ్‌తో వెళ్లటం చూశామని చెప్పటంతో వారు పోలీసులకు అతడిపై ఫిర్యాదు చేశారు. బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని విచారించగా బాలికను హత్య చేసిన సంగతి వెల్లడించాడు. ట్యూషన్‌లో చిన్నదైన, మిక్కిలి వినయ, విధేయతలు కలిగినదైన కారణంగా తను చెప్పినట్లు విని వెంట వచ్చిందని, ఆపై బాలికపై లైంగిక దాడికి దిగగా ప్రతిఘటించటంతో ఈ దారుణానికి ఒడిగట్టానని తెలిపాడు. 

మరిన్ని వార్తలు