ప్రాణం తీసిన వివాహేతర సంబంధం

31 Dec, 2019 08:18 IST|Sakshi

బుల్లితెరనటితో సహా నలుగురి అరెస్ట్‌

పెరంబూరు :  వివాహేతర సంబంధం కొనసాగించాలని ఒత్తిడి చేసినందుకు దేవి అనే బుల్లితెర నటి తన మాజీ ప్రియుడిని హత్య చేసింది. ఈ కేసులో ఆమెతోపాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాలు.. దేవి అనే బుల్లితెర నటి తన భర్త శంకర్‌తో కలిసి చాలా కాలంగా వడపళనిలో నివాసం ఉంటోంది. ఈ క్రమంలో మధురైకి చెందిన రవి(38) అనే వ్యక్తి 10ఏళ్ల క్రితం సినిమాల్లో నటించాలనే ఆసక్తితో చెన్నైకి వచ్చాడు. సాలిగ్రామంలో నివసిస్తున్న రవికి దేవితో పరిచయమైంది.

కొంతకాలానికి అది వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే ఇటీవల ఆమె ప్రియుడిని వదిలించుకోవాలని చెప్పాపెట్టకుండా కొలత్తూర్‌ సెమాత్తమన్‌ కోవిల్‌ వీధికి ఇల్లు మారిపోయింది. నటిగా అవకాశాలు తగ్గడంతో టైలరింగ్‌ వృత్తిని చేపట్టి పొట్టపోసుకుంటోంది. కాగా, ఆమె కోసం పలు చోట్ల గాలించిన రవికి దేవి చెల్లెలు లక్ష్మి ఇంటి చిరునామా తెలిసింది. దీంతో ఆదివారం రాత్రి మద్యం సేవించి లక్ష్మి ఇంటికి వెళ్లిన రవి ఘర్షణకు దిగాడు. దీనిపై సమాచారం అందుకున్న దేవి తన భర్త శంకర్‌తో కలిసి లక్ష్మి ఇంటికి చేరుకుని రవిని వెళ్లిపోవాలని కోరింది. దీనికి అంగీకరించని రవి వాగ్వాదానికి దిగడంతో కోపం పట్టలేని దేవి ఇనుప రాడ్డుతో, ఆమె భర్త శంకర్‌ కట్టెతో దాడి చేశాడు. దీంతో రవి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. దీనిపై సమాచారం అందుకున్న కొలట్టూర్‌ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని రవి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం కీల్‌పాక్కమ్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. హత్యకు పాల్పడిన దేవి, ఆమె భర్త శంకర్, చెల్లెలు లక్ష్మి, భర్త సావరీస్‌ను అరెస్ట్‌ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు