బుల్లితెర నటి భర్త ఆత్మహత్య

28 Dec, 2019 10:15 IST|Sakshi
బుల్లితెర నటి రేఖ భర్త గోపీనాథ్‌

చెన్నై ,పెరంబూరు: బుల్లితెర నటి భర్త ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన పెరంబూరు ప్రాంతంలో కలకలానికి దారి తీసింది. ఈ వివరాలు చూస్తే స్థానిక పెరంబూరు, నటరాజన్‌ కోవిల్‌ వీధికి చెందిన గోపీనాథ్‌ (39) అనే వ్యక్తి స్థానిక అన్నానగర్, టీవీఎస్‌ కాలనీలోని ఒక ప్రైవేట్‌ ప్రచార సంస్థలో కార్యనిర్వాహకుడిగా పనిచేస్తున్నాడు. అతని భార్య రేఖ. ఆమె  బుల్లితెర నటి, వ్యాఖ్యత కూడా. కాగా గురువారం ఉదయం గోపీనాథ్‌ పనిచేస్తున్న కార్యాలయాన్ని తెరవడానికి కార్మికులు వచ్చారు. వారు లోనికి వెళుతుండగా గోపీనాథ్‌ గదిలో ఉరి వేసుకుని వేలాడుతున్న దృశ్యం కంటపడింది. జేజే.నగర్‌ పోలీసులు మృతదేహాన్ని  కీల్‌పాక్కం ప్రభుత్వ ఆస్పత్రికి పోస్ట్‌మార్టానికి పంపారు.

కాగా భార్య రేఖతో గొడవ కారణంగానే గోపీనాథ్‌ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. గోపీనాథ్‌ పదేళ్ల క్రితం రేఖను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. ప్రస్తుతం రేఖ ఒక ప్రైవేట్‌ టీవీ ఛానల్‌లో పని చేస్తోంది. గత ఆరు నెలల క్రితమే గోపీనాథ్‌ జేజే.నగర్‌లోని ఒక ప్రైవేట్‌ సంస్థలో ఉద్యోగానికి చేరినట్లు, అదే సంస్థలో పని చేస్తున్న ఓ యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు తెలిసింది. ఈ విషయమై గోపీనాథ్‌కు రేఖకు మధ్య తరచూ గొడవలు జరిగేవని, గురువారం కూడా భార్యతో గొడవ పడి తన కార్యాలయానికి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు విచారణలో తెలిసింది. అప్పుల బాధ కూడా ఉన్నట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు