‘బందరు’లో హైటెక్‌ వ్యభిచారం

26 Jun, 2020 12:25 IST|Sakshi

అపార్ట్‌మెంట్‌లో వ్యాపారం

ఆన్‌లైన్‌లో అమ్మాయిల ఫొటోలతో విటులకు ఎర

విజయవాడ, ఇతర పట్టణాల నుంచి రప్పిస్తున్న బ్రోకర్లు

యువతే టార్గెట్‌... గుట్టుచప్పుడు కాకుండా వ్యాపారం

టీవీ యాంకర్లను బుక్‌ చేసుకుంటున్న సంబరాల రాంబాబులు

హోటల్‌లో బస... గెస్ట్‌హౌస్‌లలో రాసలీలలు

నెలవారీ మామూళ్లతో పట్టించుకోని పోలీసులు

సాక్షి, మచిలీపట్నం: జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో హైటెక్‌ వ్యభిచారం చాపకింద నీరులా విస్తరిస్తోంది. హోటల్స్, అపార్టుమెంట్లు, నగర శివారుల్లోని ఇండిపెండెంట్‌ హౌస్‌లలో ఈ వ్యాపారం గుట్టుచప్పుడు కాకుండా సాగుతోంది. వాట్సప్‌లలో అమ్మాయిల ఫొటోలు పంపడం.. నచ్చితే కోరుకున్న సమయానికి కోరుకున్న చోటకు వార్ని పంపిస్తూ రెండు చేతూలా ఆర్జిస్తున్నారు. గంటలు.. రోజుల తరబడి కూడా బుకింగ్‌లు జరుగుతున్నాయంటే ఏ స్థాయిలో ఇక్కడ వ్యభిచారం సాగుతుందో అర్థం చేసుకో వచ్చు. కొన్ని హోటల్స్‌ అందుకు కేంద్ర బిందువుగా మారుతున్నాయి. ముఖ్యంగా నగరం నడిబొడ్డులోని ఓ ప్రముఖ హోటల్‌లో దర్జాగా ఈ వ్యాపారం సాగుతోంది. అందుకోసం ఈ హోటల్‌లో కొన్ని రూమ్‌లను రిజిస్ట్రర్‌ చేయకుండా అన్‌రిజిస్ట్రర్‌ కోటాలో వదిలివేస్తారు. ఈ హోటల్‌లో ఐదారుగురు అమ్మాయిలు ఎప్పుడూ ఉంటారని, వారిని బుక్‌ చేసుకుంటే హోటల్‌లో రూమ్‌ కూడా ఫ్రీగా ఇస్తుంటారని వినికిడి.  (జూబ్లీహిల్స్‌ వ్యభిచార గృహంపై దాడి)

గంటకు రూ.3వేలు నుంచి..
గంటకు రూ.3వేల నుంచి 5వేలు, ఒక రాత్రికి రూ.5 నుంచి 10 వేల వరకు బుకింగ్‌లు జరుగుతున్నాయని సమాచారం. ఇక హౌసింగ్‌ బోర్డు కాలనీ, భాస్కరపురం తదితర ప్రాంతాల్లో కొన్ని అపార్టుమెంట్‌లలో అద్దెకు తీసుకున్న ప్లాట్లలో కూడా ఈ తరహా వ్యభిచారం సాగుతోందని చెబుతున్నారు. ఇక నగర శివారుల్లో ఇండిపెండెంట్‌ హౌసుల్లో కూడా ఈ తరహా వ్యభిచారం గుట్టుచప్పుడు కాకుండా సాగుతోందని తెలుస్తోంది. ఎక్కువగా 18 నుంచి 25 ఏళ్ల లోపు యువతులను విజయవాడ, గుడివాడ తదితర పట్టణాల నుంచి ఇక్కడకు తీసుకొచ్చి నగరంలో రుచిమరిగిన విటులకు వారి ఫొటోలను పంపి వారి కోరికలు తీరుస్తున్నారు. నగరంలో యువతనే టార్గెట్‌ చేస్తూ ఈ వ్యాపారం సాగిస్తున్నారు. లాక్‌డౌన్‌కు ముందు కంటే ఇప్పుడు ఎక్కువైందని చెబుతున్నారు. ఈ మధ్య ఓ చానల్‌లో పనిచేసే సిబ్బంది ఒకరు తన ఇంట్లోనే వ్యభిచారం చేయిస్తూ పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే.

యాంకర్లతో రాసలీలలు?
టీవీల్లో చిన్న చితకా పాత్రల్లో నటించిన నటులు, యాంకర్లను బుక్‌ చేసుకుని నగరానికి తీసుకొచ్చి ఎంజాయ్‌ చేస్తున్నారు. స్థానిక హోటల్స్‌లో వీరికి బస ఏర్పాటు చేసి తమకు కావాల్సినప్పుడు తమకు కావాల్సిన చోటకు తీసుకెళ్లి ఎంజాయ్‌ చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన బీచ్‌ ఫెస్టివల్స్‌లో నిర్వహించిన ఈవెంట్స్‌లో పాల్గొన్న యాంకర్లలో ఒకర్ని సంబరాల రాంబాబు ఇటీవలే నగరానికి తీసుకొచ్చి బస్టాండ్‌ సమీపంలోని ఓ హోటల్‌లో నాలుగురోజుల పాటు ఉంచి ఎంజాయి చేశారని విశ్వసనీయ సమాచారం. ఆ యాంకర్‌ ఉన్న మాట వాస్తవమేనని, రోజు ఎవరో కారులో వచ్చి ఆమెను తీసుకెళ్లే వారని వారెవరని తమకు తెలియదని ఆ హోటల్‌లో పనిచేసిన ఓ మాజీ ఉద్యోగి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. నగరంలో జరిగే ఈ హైటెక్‌ వ్యభిచారం కోసం స్థానిక పోలీస్‌ స్టేషన్లలో సమాచారం ఉన్న వారు తమకేమి పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

మరిన్ని వార్తలు